టీఎస్పీఎస్సీ పరీక్షల వాయిదాలో హనీట్రాప్ ?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం ఉన్న కంప్యూటర్ హ్యాకింగ్ కు గురవడంతో రెండు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షలకు సంబంధించిన కీలక కంప్యూటర్ హ్యాకింగ్ కి గురైందని అనుమానించిన టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు ఈ అంశంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జామ్ తో పాటు, మార్చి 15, 16లలో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ, క్లాస్ బీ పరీక్షలను నియామక బోర్డు వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
 
కాగా, ఈ విషయంపై విచారణ జరుపుతోన్న పోలీసులు టీఎస్పీఎస్సీలో జరిగింది హ్యాకింగ్ కాదు హనీట్రాప్ అనే అనుమానం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తున్నది. హనీట్రాప్ కారణంగా ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు భావిస్తున్నారు.  ఓ యువతి మాయలో పడిన టీఎస్పీఎస్సీ ఉద్యోగి పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది.

 నియామక బోర్డు సెక్రెటరీ పీఏతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోన్న యువతి తరచూ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వస్తుండేదని సిసి కెమెరాల ద్వారా గుర్తించడంతో అనుమానించారు. ఈ క్రమంలోనే. ఆమె ప్రశ్నాపత్రం  ఇవ్వాలని కోరగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సెక్రెటరీ పీఏతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. యువతి మాయలో పడి ప్రశ్నా పత్రాలను లీక్ చేశారా? లేక ఇందులో దళారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

పురపాలక శాఖ పరిధిలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు భర్తీ కోసం టీఎస్పీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, పశుసంవర్ధక శాఖ పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ – ఏ కింద 170 పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బీ కింద 15 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది.

టౌన్ ప్లానింగ్ పరీక్ష మార్చి 12న, వీఏఎస్ పరీక్ష మార్చి 15, 16లలో నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రశ్నా పత్రాల లీక్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది.