అమరావతికి అనుసంధానంగా రెండు బైపాస్‌లు

రాజధాని అమరావతి ప్రాంతాన్ని రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు కానున్న విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులకు లైన్‌ క్లియర్‌ అయింది. వెస్ట్‌ బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. మరో ఏడాదిలో రెండు ప్యాకేజీలకు సంబంధించి పనులు పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు సంస్థలకు గడువు విధించాయి.

గన్నవరం మండలం పెద్దఅవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా గుంటూరు జిల్లా చినకాకాని ఎన్నారై మెడికల్‌ కాలేజీ వరకు సుమారు 48 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ఆరు లైన్ల రహదారి చెన్నై- కోల్‌కట జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌65), చెన్నై- హైదరాబాద్‌ (ఎన్‌హెచ్‌16)తో అనుసంధానం కానుంది.

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 18 కిలోమీటర్ల పొడవున ఓ ప్యాకేజీ, గొల్లపూడి నుంచి పెద్దవుటపల్లి వరకు 30 కిలోమీటర్లతో మరో ప్యాకేజీగా వర్గీకరించి పనులు చేపట్టారు. గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతి గ్రామాలను తాకుతూ కృష్ణానదిపై మూడున్నర కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం జరగనుంది.

ప్రస్తుతం మందడం- కృష్ణాయపాలెం గ్రామాల మధ్య ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పాటు వెంకటపాలెం, ఉండవల్లిని కలుపుతూ మరో ఫ్లై ఓవర్‌ని కృష్ణానదిపై నిర్మించే వంతెనతో అనుసంధానం చేయనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయికి పెంచడంతో రద్దీ పెరిగింది.

దీన్ని నియంత్రించేందుకు విజయవాడ బైపాస్‌కు మోక్షం కల్పించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. పుష్కర కాలంగా ఆగిన ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతున్నాయి.. సుమారు రూ. 4700 కోట్ల అంచనా వ్యయంతో ఈస్ట్‌ బైపాస్‌ ఏర్పాటు కానుంది.

విశాఖ పట్టణం నుంచి నేరుగా హైదరాబాద్‌కు కూడా ఈ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు గుంటూరు జిల్లాలో చెన్నై నుంచి వచ్చే వాహనాలు మంగళగిరి మండలం నిడమర్రు, మందడం, వెంకటపాలెం మీదుగా ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడి మీదుగా ఎన్‌హెచ్‌ 16ను కలుస్తుంది. వెస్ట్‌ బైపాస్‌ రోడ్డు మరో ఏడాదిన్నర లోపు పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి.

 కాగా కృష్ణాజిల్లా పొట్టిపాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు ఈస్ట్‌ బైపాస్‌ రోడ్డు ప్రతిపాదనలకు ఎట్టకేలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపింది.కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లంక గ్రామాలను కలుపుతూ కృష్ణానదిపై మరో వంతెన నిర్మాణం జరగనుంది. వెస్ట్‌ బైపాస్‌తో పాటు ఈస్ట్‌ బైపాస్‌ సిద్ధమైతే కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ భారీ అవుటర్‌ రింగురోడ్డుకు అంకురార్పణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ బైపాస్‌ రోడ్డును 49 కిలోమీటర్ల మేర ఆరు లైన్లలో నిర్మించనున్నారు. కృష్ణాజిల్లాలో 29 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో 20 కిలోమీటర్ల మేర ఈస్ట్‌ బైపాస్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇందుకయ్యే భూసేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యయాన్ని భరించలేమని కేంద్రానికి నివేదించడంతో ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమయ్యే వివిధరకాల సీనరేజి, రాష్ట్ర జీఎస్‌టీని మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈస్ట్‌ బైపాస్‌లో భాగంగా నిర్మితమయ్యే మల్టి లాజిస్టిక్‌ పార్కుకు వందెకరాల స్థలాన్ని కూడా అందించాలని సూచించింది. ఇందుకోసం మంగళగిరి వద్ద రాష్ట్ర ప్రభుత్వం భూములు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.