1969 మార్చి 10న 3వేల సిబ్బందితో ప్రారంభమై లక్షా 80 వేల మందికి సీఐఎస్ఎఫ్ బలగాలు చేరుకున్నాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పవర్ ప్లాంట్స్, జాతీయ పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పిస్తుందని చెప్పారు.
ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ 66 సున్నితమైన, ప్రధాన విమానాశ్రయాలు, 14 ప్రధాన నౌకాశ్రయాలు, అణు, అంతరిక్ష సంస్థలు, ఢిల్లీ మెట్రో, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, అనేక పారిశ్రామిక యూనిట్లు, గనులకు భద్రత కల్పిస్తోందని అమిత్ షా చెప్పారు. సిఎపిఎఫ్లలో సిఐఎస్ఎఫ్ మాత్రమే సమర్థవంతమైన అగ్నిమాపక దళాన్ని కలిగి ఉందని, అగ్ని రక్షణ రంగంలో ఘనత సాధించిందని ఆయన తెలిపారు.
ఢిల్లీ మెట్, ఎయిర్పోర్ట్లో ప్రతిరోజూ సుమారు 50 లక్షల మంది ప్రయాణికులతో వ్యవహరిస్తున్నప్పుడు, సీఐఎస్ఎఫ్ ధర్మబద్ధమైన దృఢమైన ప్రవర్తనతో దేశం ఆస్తుల భద్రతకు కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సమకాలీన డిజిటల్ యుగంలో, సీఐఎస్ఎఫ్ దాని లబ్దిదారులకు అత్యాధునిక భద్రతను అందించిందని ఆయన తెలిపారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం ద్వారా భద్రతా ప్రోటోకాల్ను దుర్భేద్యంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక యూనిట్ల భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతలను అవలంబించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సీఐఎస్ఎఫ్ ను అన్ని సరికొత్త సాంకేతికతలతో సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని నిబంధనలను రూపొందిస్తుందని అమిత్ షా వెల్లడించారు. ఇందుకు సంబంధించి హోంశాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదంపై 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్షా పేర్కొన్నారు.”కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాలు ఈ మూడింటిలోనూ హింస గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల సంఖ్య తగ్గడమే కాదు.. లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు” అని తెలిపారు.
దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే కఠినంగా అణచి వేస్తామని అమిత్ షా హెచ్చరించారు. ఇందులో సీఐఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులది కీలకపాత్ర చెప్పారు.
హైదరాబాద్ హకీంపేట్లోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం 54వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘రైజింగ్ డే’ వేడుకలను తొలిసారి దిల్లీ వెలుపల హకీంపేట్లోని సీఐఎస్ఎఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, డీజీపీ అంజనీకుమార్ కూడా పాల్గొన్నారు.
ముందుగా గౌరవవందనం స్వీకరించిన అమిత్షా దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు రివార్డులు అందజేశారు. అనంతరం ‘రైజింగ్ డే’ వేడుకల సందర్భంగా సీఐఎస్ఎఫ్ సత్తాను కళ్లకు కట్టేలా నిర్వహించిన కవాతులు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
More Stories
వాయనాడ్ నుంచి కూడా రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు