శ్రీ చైతన్య విద్యార్థి ఆత్మహత్య… విద్యార్థులు ఆందోళన

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ సాత్విక్ (16) ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఎన్. సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు స్వాతిక్ ఫ్రెండ్స్, ఇతర విద్యార్థులు చెప్పారు.

కొన ఊపిరితో ఉన్న సాత్విక్ ను రక్షించే ప్రయత్నం వార్డెన్ చేయలేదు. పైగా విద్యార్థులపై అరిచి వారిని అక్కడ నుండి వెళ్లగొట్టి గదికి తాళం వేశాడు. కొన ఊపిరితో ఉండగానే గదికి తాళం వేయడంతో దాదాపు పావుగంట ఆలస్యం అయింది. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే సాత్విక్ బ్రతికేవాడు. ఆ తర్వాత విద్యార్థులు రెచ్చిపోయి ఆందోళన చేపట్టడంతో వార్డెన్ గది తాళం తీశాడు.

అప్పటికే ఇంకా సాత్విక్ కొనఊపిరితోనే ఉండడం గమనార్హం. వార్డెన్ రక్షించే ప్రయత్నం చేయకపోవడంతో సాత్విక్ మృత్యువాత పడ్డాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో కనీసం కాలేజీ సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని, ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదని విద్యార్థులు చెబుతున్నారు. తోటి విద్యార్థులే ఓ వ్యక్తి బైక్ పై దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారని వివరించారు.

అయితే.. ఆస్పత్రికి తరలించే లోపే సాత్విక్ చనిపోయాడు. పోస్టుమార్టం కోసం సాత్విక్ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

బుధవారం నార్సింగ్‌ శ్రీచైతన్య కాలేజీ ఎదుట సాత్విక్‌ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నిరసన తెలిపారు. తమ కుమారుడు సాత్విక్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకున్నారు.

కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నార్సింగి చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేవరకూ ఇక్కడ నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ లో చేర్చిన నిందితులను తమ ముందుకు తీసుకురావాలని సాత్విక్ బంధువులు డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.

మరోవైపు.. కాలేజీ విద్యార్థులను  సిబ్బంది బాగా టార్చర్ పెడుతున్నారని కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ క్లాస్ రూమ్ లోనే విద్యార్థులను అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచార్య కొడుతున్న విజువల్స్ బయటికొచ్చాయి. కాలేజీలో కులం పేరుతో దూషించేవాడని, తనకున్న ఆస్తుల గురించి చెబుతూ విద్యార్థులను చిన్నచూపు చూసేవాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కాలేజీ హాస్టల్ ఇన్ చార్జ్ నరేష్ కూడా విద్యార్థులను బూతులు తిడుతూ ఉంటాడని విద్యార్థులు చెబుతున్నారు.

కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు సాత్విక్ ఆత్మహత్య ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం ఫ్యాకల్టీ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్ పై కేసులు నమోదు చేశామని ఏసీపీ రమణ గౌడ్ చెప్పారు. గతంలో కొంతమంది సిబ్బంది విద్యార్థులను తరగతి గదిలోనే కొట్టిన వీడియోలపైనా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.