కొత్త నియామకాలతో యుపిలో ఉపాధి, భద్రత మెరుగయ్యాయి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో 2017 నుంచి 1.5 లక్షలకు పైగా కొత్త నియామకాలు జరపడంతో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉపాధి, భద్రత రెండూ మెరుగయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో శాంతిభద్రతలకు, అభివృద్ధి ధోరణికి ప్రతీకగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు పొందిందని కొనియాడారు. ఆ మేరకు శాంతిభద్రతల విధ్వంసం, మాఫియా విజృంభణకు ఆలవాలమైన పూర్వ దుస్థితి అంతమైందని స్పష్టం చేశారు. దీంతో ఉపాధి, వ్యాపారం, పెట్టుబడులు వంటి కొత్త అవకాశాలకు బాటలు పడ్డాయని చెప్పారు.
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి మేళా సందర్భంగా ప్రధాని వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ ఉపాధి మేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసు శాఖలో సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, దానితో సమాన హోదాగల నాగరిక్‌ పోలీస్‌, ప్లటూన్‌ కమాండర్స్‌, అగ్నిమాపక విభాగం సెకండ్‌ ఆఫీసర్ల పోస్టులకు ప్రత్యక్ష విధానంలో ఎంపికైనవారికి నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఈ 
 
ఈ నియామకాలతో 9 వేల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని చెబుతూ దీనివల్ల రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలోపేతం అవుతుందని, తద్వారా ప్రజల్లో భద్రత భావన పెరుగుతుందని ప్రధాని తెలిపారు.  రాష్ట్రంలో డబల్ ఇంజిన్ ప్రభుత్వ కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ  కొత్త విమానాశ్రయాలు, ప్రత్యేక రవాణా కారిడార్, కొత్త రక్షణరంగ కారిడార్, కొత్త మొబైల్ తయారీ యూనిట్లు, ఆధునిక జలమార్గాలు, అపూర్వ ఉపాధి అవకాశాలు సృష్టించగల కొత్త మౌలిక సదుపాయాల జాబితాను ప్రధాని ఏకరవుపెట్టారు.
 
అత్యధిక ఎక్స్‌’ప్రెస్‌’వేలుగల ఉత్తరప్రదేశ్‌లో రహదారులు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వీటివల్ల ఉపాధి సృష్టితో పాటు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాజెక్టులకు మార్గం సుగమం అవుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ఊతమివ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన చెప్పారు. ఇటీవలి ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఉత్సాహభరిత స్పందన గురించి చెబుతూ అది రాష్ట్రంలో ఉపాధికి ఏ విధంగా ఉత్తేజమిస్తుందో కూడా మోదీ వివరించారు.

“ఉపాధి, భద్రతల సంయుక్త శక్తి ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం ఇస్తోంది” అని ప్రధానమంత్రి కొనియాడారు ముద్ర పథకం కింద రూ.10 లక్షలదాకా పూచీకత్తులేని రుణాలు, ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పథకం, ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం నిరంతర విస్తరణ, శక్తిమంతమైన అంకుర సంస్థల పర్యావరణ ‌వ్యవస్థ వగైరాను ఈ సందర్భంగా మోదీ  ఉదాహరించారు.

నేటి ఉపాధి మేళాలో నియామక లేఖలు పొందినవారిని ఉద్దేశించి మాట్లాడుతూ కొత్త బాధ్యతలతోపాటు వారికి ఎదురుకాగల కొత్త సవాళ్ల గురించి ప్రధాని ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా కొత్తదేదైనా నేర్చుకోవాలనే జిజ్ఞాసను సజీవంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం, ప్రగతి దిశగా నిరంతర కృషి చేయాల్సిందిగా ఉద్బోధించారు.

“మీరు పోలీసు ఉద్యోగంలో చేరాక మీ చేతికో ‘లాఠీ’ వస్తుంది. కానీ, దేవుడు మీకొక హృదయం కూడా ఇచ్చాడని మరువకండి. కాబట్టి, వివేచనతో మెలగుతూ వ్యవస్థలోనూ వివేచన నింపండి” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వివేచన వికాసంలో శిక్షణ పాత్రను కూడా ఆయన ఉటంకించారు.

నేటి ఆధునిక ప్రపంచంలో సైబర్‌ నేరాలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ వంటివాటిపై అవగాహన స్మార్ట్‌ పోలీస్‌ విధులకు దోహదం చేస్తుందని సూచించారు. సమాజానికి భద్రత కల్పించడంతోపాటు కొత్త దిశ నిర్దేశించి బాధ్యత కూడా కొత్తగా నియమితులైనవారికి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. కాబట్టి, “ప్రజలకు బలం, సేవాప్రదానంలో మీరే ప్రతీకలు కాగలరు” అని చెప్పారు.