జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కుష్బూ

సినీ నటి, తమిళనాడుకు చెందిన బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నియమించింది. ఆమెతో పాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్ లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్లు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.

దక్షిణాదిలో నటిగా పేరొందిన ఖుష్బూ వందకు పైగా తమిళ సినిమాల్లో నటించారు. రాజకీయాలపై ఆసక్తితో 2010లో డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2020 దాకా కాంగ్రెస్ లో జాతీయ అధికార ప్రతినిధిగా సేవలందించారు. తర్వాత ఖుష్బూ బిజెపి లో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.

తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి  కుష్బూ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి తాను కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ‘జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నా మొదటగా కల్పించబోయే అవగాహన కార్యక్రమం మహిళలను మాట్లాడమని కోరడమే. అప్పుడు మాత్రమే మనం పోరాడవచ్చు’ అని ఖుష్బూ చెప్పారు.

ఆమెకు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై అభినందనలు తెలియజేశారు. ‘మహిళల హక్కుల కోసం నిరంతరం ఖుష్బూ చేసిన పోరాటానికి దక్కిన గౌరవం ఇది’ అని ఆయన కొనియాడారు.