ఫడ్నవిస్‌ను అప్పట్లో అరెస్ట్ చేయచూసిన థాకరే!

మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అప్పట్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ నేత గిరీష్ మహాజన్‌ను కూడా ఎంవీఏ సర్కార్ అరెస్టు చేయాలనుకున్నట్టు ఆయన చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.

”అప్పటి బీజేపీ విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్, గిరీష్ మహాజన్‌లను ఎంవీఏ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకుంది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. మహాజన్‌పై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టం-1999ని ప్రయోగించాలని చూసింది. వారిని ఆపేందుకు తాను ఏమి చెప్పాననేది ఇప్పుడు మళ్లీ చెప్పదలచుకోలేదు” అని షిండే వెల్లడించారు.

అయితే, వారి (ఎంవీఏ) నిర్ణయాన్ని మార్చడానికి బదులుగా ఆ తర్వాత మొత్తం ప్రభుత్వాన్నే తాను కుప్పకూల్చానని, వాళ్లని ఇంట్లో కూర్చునేలా చేశానని ఎద్దేవా చేశారు. ఈ కుట్రలో ప్రమేయం ఉన్న వారిపై మీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు, వారిని గద్దెదింపడమే చాలని, ఇలాంటి ఆలోచన చేసిందెవరో తనకు బాగా తెలుసునని, అవసరమైతే దానిపై విచారణ జరిపిస్తామని షిండే స్పష్టం చేశారు.

దేవేంద్ర ఫడ్నవిస్ సైతం గత ఏడాది జనవరిలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలను థాకరే ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న ఎన్‌సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ తోసిపుచ్చారు. ఆసక్తికరంగా, ప్రస్తుతం హోం మంత్రి పదవి సైతం ఫడ్నవిస్ చేతిలో ఉండగా, రాష్ట్ర వైద్య విద్య రీసెర్చ్ శాఖ మహాజన్ చేతిలో ఉంది.