దౌత్యం, చర్చల ద్వారానే రష్యా-ఉక్రెయిన్‌ వివాదం పరిష్కారం

రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ ఒత్తిడి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యావత్​ ప్రపంచంపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్​కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం పలికాయి.

అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత వారిద్దరూ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ  మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్‌ సూచిస్తూనే ఉందని పేర్కొన్నారు. ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉంద‌ని ప్రధాని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయ‌ని తెలిపారు. యూరప్‌లో భారత్​కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులకు ముఖ్యమైన వనరు కూడా అని తెలిపారు.

అలాగే భారత్​, జర్మనీ మధ్య బలమైన సంబంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయ‌ని పేర్కొంటూ  గత కొన్నేళ్లుగా భారత్​, జర్మనీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయ‌ని మోదీ  తెలిపారు.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్‌ షోల్జ్ తెలిపారు. హింసతో దేశ సరిహద్దులను ఎవరూ మార్చలేరని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం వల్ల అపారమైన నష్టం, విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఒక విపత్తుగా అభివర్ణించారు.

 “భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిది. రష్యా దురాక్రమణ పర్యవసానాలతో ప్రపంచం అల్లాడిపోతోంది. దాదాపు 1,800 జర్మన్ కంపెనీలు భారత్​లో ఉన్నాయి. అవి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. మాకు ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. సాఫ్ట్‌వేర్ రంగం భారత్​లో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు భారత్​లో ఉన్నాయి” అని పేర్కొన్నారు.