ఇండోనేషియాలోకి తొలిసారి భారత జలాంతర్గామితో చైనా కలవరం

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాల పట్ల వివాదాలు కొనసాగుతున్న వేళ ఆసియా దేశాలతో  దౌత్య, సైనిక విస్తరణలో భాగంగా భారత్ జలాంతర్గామి  మొదటిసారిగా ఇండోనేషియా జలాల్లోకి ప్రవేశించింది. 3,000-టన్నుల బరువున్న డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధుకేసరి బుధవారం సుండా జలసంధి గుండా ప్రయాణించి జకార్తా చేరుకోవోడం చైనాకు కలవరం కలిగిస్తుంది.
 
‘‘భారత యుద్ధనౌకలు తరుచూ ఇండోనేషియా, ఇతర ఆసియా దేశాలను సందర్శిస్తాయి.. జలాంతర్గామి ఈ మొదటి దీర్ఘ-శ్రేణి విస్తరణ సముద్ర అడుగు భాగాన దేశం పోరాట విభాగం కార్యాచరణ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది’’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.  ఐఎన్ఎస్ సింధుకేసరి ఆపరేషనల్ సింధుఘోష్-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ ఎటాక్ సబ్‌మెరైన్‌లకు సంబంధించింది. దీనిని రష్యాలోని సెవెరోడ్‌విన్‌స్క్‌లో 2018 చివరిలో ఆధునీకరించారు.
 
ఆల్ఫా క్రూయిజ్ మిసైల్‌ సిస్టమ్‌కు అనుగుణంగా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సబ్‌మెరైన్‌లు 72.6 మీటర్ల పొడవు, 9.9 మీటర్ల బీమ్‌ కలిగి ఉంటాయి. నీటిలోపల 18 నాట్స్‌ వరకు ప్రయాణించగలవు. సుమారు 45 రోజుల పాటు నీటి ఆడుగు భాగంలో ఉండగలిగే ఈ జలాంతర్గామి.. వెపన్స్‌ సిస్టమ్‌ టార్పెడోలు, యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రయోగించగలదు.
 
ఫిబ్రవరి ఆరంభంలో నాగ్‌పూర్‌లో ఫిలిప్పీన్స్ సైన్యానికి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వినియోగంపై శిక్షణ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇండోనేషియాకు భారత్ జలాంతర్గామి ఇండోనేషియాలో ప్రవేశించడం గమనార్హం. గతేడాది జనవరిలో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఫిలిప్పీన్స్‌కు 290 కి.మీల దూరంలోని లక్ష్యాన్ని చేరుకోగల మాక్ 2.8 వద్ద ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో దూసుకెళ్లే సంప్రదాయ (అణుయేతర) ఆయుధం బ్రహ్మోస్ యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థ బ్యాటరీలను భారత్ సరఫరా చేయనుంది.

దక్షిణ చైనా సముద్రంలో చైనాతో విబేధాలు కొనసాగుతున్న వేళ తొలిసారి ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ను సరఫరా చేయడం వల్ల ఇండోనేషియా, వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాలతో ఇటువంటి ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ఓవైపు ఆఫ్రికా, గల్ఫ్ దేశాలతో సైనిక సంబంధాలు.. మరోవైపు సైనిక విన్యానాలు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములను నడపడానికి శిక్షణా కార్యక్రమాలు, పెరుగుతున్న ఆయుధ సరఫరాల ద్వారా ఆసియా దేశాలతో భారత రక్షణ సంబంధాలను క్రమంగా పెంచుతోంది.

 
2020లో కిలో క్లాస్ తరగతి జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధువీర్‌ను మయన్మార్‌కు భారత్ పంపింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌తో పాటు, శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌లు, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను 25 కిలోమీటర్ల పరిధిలో ఛేదించగల స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థలను కూడా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు విక్రయించాలని భారత్ భావిస్తోంది.

ద్వైపాక్షిక విన్యాసాల విషయానికి వస్తే ఇటీవలి నెలల్లో సింగపూర్‌తో భారత్ నేవీ ‘సింబెక్స్’, ఆర్మీ ‘అగ్ని వారియర్’.. మలేషియాతో ‘హరిమౌ శక్తి’, ఇండోనేషియాతో ‘గరుడ్ శక్తి’ నిర్వహించింది. ఇక, భారత్, ఇండోనేషియా ఏడాదికి రెండు సార్లు నావెల్ పెట్రోల్ నిర్వహిస్తాయి. చివరిసారిగా డిసెంబరులో అంతర్జాతీయ మారీటైమ్ సరిహద్దు రేఖ వద్ద ఇది జరిగింది.

‘భారత్, ఇండోనేషియా తమ వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని విస్తృత శ్రేణిలో విస్తరించాయి.. ప్రత్యేకించి 2018లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ పర్యటన సందర్భంగా కొత్త రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత మరింత పెరిగింది’ అని ఓ సీనియర్ అధికారి చెప్పారు.