పార్లమెంటు బడ్జెట్ మొదటి విడత సమావేశాలు సోమవారంతో ముగిశాయి. జనవరి 31వ తేదిన ప్రారంభమైన ఉభయ సభల సమావేశాలు మార్చి 13వ తేదికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుండి అదాని అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకొంటూ ఉండడంతో ప్రతిష్టంభన కొనసాగుతుంది.
సోమవారం నాడు కూడా ఇదే అంశంపై ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. అదానీ గ్రూపు మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయడంతో పాటు కాంగ్రెస్ ఎంపి రజనీ పాటిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సభను మార్చి 13 వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ ప్రకటించారు.
అంతకుముందు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష ఎంపిలు పట్టుబట్టడంతో చైర్మన్ అందుకు అంగీకరించారు. అయితే సభాధ్యక్షుడిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉండడంతో అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
ఖర్గే ప్రసంగంలో తాను వత్తిడులకింద పనిచేస్తున్నట్లు పలుమార్లు పేర్కొనడం పట్ల ధంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిసారి సభాధ్యక్షడు వత్తిడులకింద పనిచేస్తున్నారన్తి ప్రతిపక్ష నాయకుడిగా అర్హత కోల్పోతున్నారని స్పష్టం చేస్తూ
ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు.
దీంతో ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరుకున్నారు. ఈ నేపధ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ నేత పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ సభా కార్యకలాపాలను అడ్డుకునుందుకు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల విషయమై బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వివాదాలు చెలరేగడంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలను మునిసిపల్ కార్పొరేషన్ స్థాయికి దిగజార్చవద్దని హితవు చెప్పారు.
మరోవంక, సమాజవాద్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభ చైర్మన్ వైపు కోపంగా వేలుపెట్టి చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల బిజెపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో కేవలం “దయచేసి కూర్చోండి” అని మాత్రమే అధ్యక్షస్థానంలో ఉన్న ధంకర్ అంటున్నారు.
ఈ సంవత్సరం ఇవి మొదటి సమావేశాలు కావడంతో రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం తొలిరోజున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని హరీష్ ద్వివేది, కమలేష్ పాశ్వాన్ బలపరిచారు. ఈ అంశంపై చర్చకు లోక్సభలో 12 గంటలు కేటాయించగా 15 గంటల 13 నిమిషాల పాటు చర్చ జరిగింది.
రాజ్యసభలో దీనిని శ్రీమతి గీత అలియాస్ చంద్రప్రభ ప్రతిపాదించగా, శ్వైత్ మాలిక్ బలపరిచారు. ఈ అంశంపై చర్చకు 12 గంటలు కేటాయించగా 12 గంటల 56 నిమిషాల పాటు చర్చజరిగింది. ఉభయసభలలో ఈ తీర్మానాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ఆమోదించారు.
2022-23 కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. సెషన్లోని మొదటి భాగంలో ఉభయ సభల్లో కేంద్ర బడ్జెట్పై సాధారణ చర్చ జరిగింది. అందుకోసం 12 గంటల చొప్పున సమయం చర్చకోసం కేటాయించగా, లోక్సభలో 15 గంటల 35 నిమిషాలు, రాజ్యసభలో 11 గంటల 01 నిమిషాల పాటు చర్చజరిగింది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ,రాజ్యసభ. లోక్సభ 27 సమావేశాలు జరిగాయని త్లెఇపారు. వాస్తవానికి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, ఈ సమావేశాన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకుల డిమాండ్తో కుదించామని మంత్రి తెలిపారు.
సమావేశంలో మొత్తం 13 బిల్లులు (లోక్సభలో 12, రాజ్యసభలో 1 ) ప్రవేశపెట్టారు.13 బిల్లులను లోక్సభ ఆమోదించగా, 11 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన మొత్తం బిల్లుల సంఖ్య 11.
More Stories
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు