పాక్ పై భారత్ మహిళలు 7 వికెట్ల తేడాతో ఘన విజయం

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ 2023లో భారతజట్టు ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని టీమిండియా ఓవర్ మిగిలి ఉండగానే 19 ఓవర్లకే ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది.
 
 ధనాధన్ షెఫాలీవర్మ 25 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి శుభారంభాన్ని అందించగా జెమీమా రోడ్రిగ్స్ 38బంతుల్లో 8ఫోర్లుతో 53పరుగులు చేసి కీలక మెరిసింది. వికెట్‌కీపర్ రీచాఘోష్ 20బంతుల్లో 5ఫోర్లుతో సాధించి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. అజేయ హాఫ్‌సెంచరీతో అలరించిన రోడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా పాక్ స్కిప్పర్ మరూఫ్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్ ఆల్‌రౌండ్ ప్రతిభ ముందు వెలవెలబోయింది.
 
మహిళల టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక లక్ష్య చేధన కాగా, ఓవరాల్‌గా ఇదే రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం.  150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యష్టికా భాటియా (17), షఫాలీ వర్మ (33) శుభారాంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ 5.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 38 పరుగులు జోడించారు.
బాగా ఆడుతున్న దశలో భాటియాను సాదియా ఇక్బాల్ పెవిలియన్ చేర్చింది. జెమీమాతో కలిసి రెండో వికెట్‌కు 27 పరుగులు జోడించిన షఫాలీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించగా.. బౌండరీ లైన్ వద్ద నష్రా సంధు అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. దీంతో భారత్ 65 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

జెమీమాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (16) పాక్ కెప్టెన్ మరూఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత్ 93 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో టీమిండియా విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్లో రీచా ఘోష్ హ్యాట్రిక్ ఫోర్లు బాదగా.. 19వ ఓవర్లో జెమీమా మూడు ఫోర్లు బాదడంతో భారత్ విజయం సాధించింది.

 
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రెండో ఓవర్లోనే జావేరియా ఖాన్ వికెట్ కోల్పోయిన పాక్.. 12.1 ఓవర్లలో 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పాక్ ఆడుతున్న తీరు చూస్తే.. ఆ జట్టు 130 పరుగులు చేయడమే గొప్ప అనిపించింది.

కానీ కెప్టెన్ బిస్మా మరూఫ్ (55 బంతుల్లో 68*) మరో ఎండ్‌లో పాతుకుపోయింది. బిస్మా అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా, ఆయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్) దూకుడుగా ఆడింది. వీరిద్దరూ చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు పిండుకున్నారు. దీంతో పాకిస్థాన్ 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వరల్డ్ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బౌండరీలను ఆపారు. కానీ చివరి రెండు ఓవర్లలో ఆయేషా ఇచ్చిన క్యాచ్‌ను రెండుసార్లు జారవిడిచారు. ఆఖరి ఓవర్లో క్యాచ్ వదిలేయడంతో అది కాస్తా సిక్స్‌గా వెళ్లింది