హిండెన్‌బర్గ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సన్నాహాలు

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఈ రంగంలో గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్‌టెల్ ను నియమించుకుంది. ఈ సంస్థలోని అత్యంత అనుభవజ్ఞులైన న్యాయవాదులు లిప్టన్, రోజెన్, కట్జ్‌లను ఎంపిక చేసుకుంది. న్యూయార్క్‌లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భారీ, సంక్లిష్ట లావాదేవీల నిర్వహణలో గొప్ప పట్టు ఉంది.

అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిపులేషన్, మోసాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. ఈ గ్రూప్ స్టాక్స్ అమ్మకాలు నిరంతరం కొనసాగడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎఫ్‌పీఓను ఉపసంహరించుకోవలసి వచ్చింది.

హిండెన్‌బర్గ్ నైతికత లేని షార్ట్ సెల్లర్ అని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఈ నివేదిక పూర్తిగా అబద్ధమని పేర్కొంది. పెట్టుబడిదారుల్లో భరోసాను నింపడంపై గౌతమ్ అదానీ దృష్టి సారించారు. తన వ్యాపార సామ్రాజ్యం బలమైన పునాదులపై నిర్మితమైందని, ఎటువంటి ఆర్థిక నష్ట భయాలు లేవని గట్టిగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ గ్రూప్ న్యూయార్క్‌లోని వాచ్‌టెల్ న్యాయవాద సంస్థను సంప్రదించిందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ న్యాయవాద సంస్థ అమెరికాలో అత్యంత ఖరీదైనదని పేర్కొంది. దీనినిబట్టి హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలపై ఎంత తీవ్రంగా పడిందో అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.

పెట్టుబడి పెట్టినవారిని కాపాడాలి

ఇలా ఉండగా, అదానీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టినవారు,  అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్  నివేదిక నేపథ్యంలో భారీ నష్టాల్లో కూరుకుపోయారని, మదుపరులను కాపాడవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
 
ఈ అంశంపై దేశంలో అమలవుతున్న నియంత్రణ వ్యవస్థల గురించి, తాజా పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)ను ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని తెలిపింది.
 
న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్పందిస్తూ, హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో మార్కెట్ పతనమవడం వెనుక కారణాలపై నివేదికను  నివేదికను సోమవారంనాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది.
 
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు నియంత్రణ నిబంధనావళిని ఏ విధంగా పటిష్టపరచవచ్చునో సలహాలు ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఆచితూచి మాట్లాడింది. ‘‘మేం ఏం చెప్పినా మార్కెట్ సెంటిమెంట్, పెట్టుబడిదారుల ఆత్మవిశ్వాసం ప్రభావితం కావచ్చు’’నని పేర్కొంది.