
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఈ రంగంలో గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్టెల్ ను నియమించుకుంది. ఈ సంస్థలోని అత్యంత అనుభవజ్ఞులైన న్యాయవాదులు లిప్టన్, రోజెన్, కట్జ్లను ఎంపిక చేసుకుంది. న్యూయార్క్లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భారీ, సంక్లిష్ట లావాదేవీల నిర్వహణలో గొప్ప పట్టు ఉంది.
అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిపులేషన్, మోసాలకు పాల్పడుతున్నట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. ఈ గ్రూప్ స్టాక్స్ అమ్మకాలు నిరంతరం కొనసాగడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎఫ్పీఓను ఉపసంహరించుకోవలసి వచ్చింది.
హిండెన్బర్గ్ నైతికత లేని షార్ట్ సెల్లర్ అని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఈ నివేదిక పూర్తిగా అబద్ధమని పేర్కొంది. పెట్టుబడిదారుల్లో భరోసాను నింపడంపై గౌతమ్ అదానీ దృష్టి సారించారు. తన వ్యాపార సామ్రాజ్యం బలమైన పునాదులపై నిర్మితమైందని, ఎటువంటి ఆర్థిక నష్ట భయాలు లేవని గట్టిగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ గ్రూప్ న్యూయార్క్లోని వాచ్టెల్ న్యాయవాద సంస్థను సంప్రదించిందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ న్యాయవాద సంస్థ అమెరికాలో అత్యంత ఖరీదైనదని పేర్కొంది. దీనినిబట్టి హిండెన్బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలపై ఎంత తీవ్రంగా పడిందో అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు