ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు రన్నింగ్‌లో ఊడిపోయింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తుండగా దూల్‌పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు కారు టైరు ఊడిపోయింది.
 
కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో విడుదల చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్  మార్చాలని గత కొంతకాలంగా  ప్రభుత్వానికి  మొరపెట్టుకున్నా తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని  రాజాసింగ్ వాపోయారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని  కోరారు.
 
“బండి డ్యామేజ్ ఉంది.. పాత బండి.. ప్రాబ్లమ్ వస్తుందని అనేక సార్లు చెప్పిన. ఎన్నోసార్లు బండి చెడిపోయింది అయినా ఛేంజ్ చేయలే. ఇవాళ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే ప్రమాదం జరిగింది. మెళ్లిగా వచ్చినా కానీ ప్రమాదం జరిగింది. బండి స్పీడ్‌గా ఉండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యుండేది” అంటూ రాజాసింగ్ ఆడియోలో తెలిపారు.
 
“ఓఆర్ఆర్ లాంటి రోడ్డు మీద బండి ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. దేవుడి ఆశీర్వాదం వల్ల ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా బండి ఛేంజ్ చేయండి. లేకపోతే మీ బండి మీరు తీసుకోండి. అవసరం లేదు.” అని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గతంలోనూ ఆయన కారు పలుమార్లు మెరాయించింది. ఇటీవల రోడ్డు మధ్యలో కారు ఆగిపోగా, ఆయన మరో కారులో ఇంటికి చేరుకున్నారు. తనకు వెహికల్ మార్చాలని గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.