దేశ విభజనకు ముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో 1943లో జన్మించిన ముషారఫ్కు ఆరు దశాబ్దాల తరువాత 2005లో ఢిల్లీలోనే భారత ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రం అందించింది. అప్పట్లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముషారఫ్కు ఈ పత్రాన్ని అపురూప కానుకగా అందించారు.
ఆయన ఢిల్లీలో పుట్టారు. పాకిస్థాన్లో ఏలారు. ఇప్పుడు దుబాయ్లో మరణించారని అప్పట్లో ఆయనకు బర్త్ సర్టిఫికెట్ జారీ క్రమంలో బాధ్యతలు నిర్వర్తించిన ఓ మాజీ అధికారి తెలిపారు. కార్గిల్ దుస్సాహసం తరువాత భారత పర్యటనకు వచ్చిన ముషారఫ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఢిల్లీలో తాను పుట్టి పెరిగిన ప్రాంతాలల్లో తల్లితో కలిసి తిరిగి వెళ్లారు.
ఇలా ఉండగా, జనరల్ పర్వేజ్ ముషారఫ్ ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి కారకుడయ్యారని, అల్ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను కొనియాడారని గుర్తు చేసింది. ముషారఫ్ (79) సంగతి తెలిసిందే. ముషారఫ్ మృతిపై శశి థరూర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ముషారఫ్ అరుదైన ఒకప్పుడు భారత దేశానికి రాజీలేని శత్రువు అని, అయితే 2002-2007 మధ్య కాలంలో నిజమైన శాంతికాముకుడిగా మారారని కొనియాడారు.
ఆ రోజుల్లో తాను ఐక్య రాజ్య సమితిలో ఆయనను ప్రతి సంవత్సరం కలిసేవాడినని చెప్పారు. ఆయన చాలా తెలివైనవారని, కలుపుగోలుగా ఉంటారని, వ్యూహాత్మక ఆలోచనలో చాలా స్పష్టంగా ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ఈ కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండా అని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు ముషారఫ్ను ప్రశంసిస్తోందని దుయ్యబట్టారు. ముషారఫ్ గతంలో రాహుల్ గాంధీని జెంటిల్మన్ అని పొగిడారని గుర్తు చేశారు.
More Stories
రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్ బాధ్యతలు స్వీకారం
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలపై సిబిఐ దర్యాప్తు
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు