ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారు

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వైసిపి తిరుగుబాటు నేత, ఎంఎల్ఎ కోటంరెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై తనకు స్పష్టమైన సాక్షం దొరికిందని వెల్లడించాయిరు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఫోన్ ట్యాపింగ్‌తో దొంగతనంగా తన కాల్స్ వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపిఎస్ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
 
తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు.  అవమానాలు జరిగిన చోట ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తాను వైసిపిని వీడనున్నట్లు సంకేతం ఇచ్చారు.  15 నెలల తరువాత ప్రజలు ఎలా తీర్పిస్తారో ఎవరికీ తెలియదని అంటూ నాయకుడే నమ్మకపోతే ఇక తాను పార్టీలో ఉండేది ఎందుకు ? అని ప్రశ్నించారు.
 
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని తెలిపారు. జగన్ పైన, వైసిపి పైన ఏనాడు పరుషంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. బారాషాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదని కోటంరెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేయనని స్పష్టం చేశారు. తన మనసు వైసిపిలో ఉండొద్దని చెప్పుతుందని వెల్లడించారు.
 
 కాగా, తన ఫోన్ ట్యాపింగ్ పై ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనతో మాట్లాడారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెబుతూ  ఆ ఆడియో కూడా తనకు పంపారని పేర్కొన్నారు. ట్యాపింగ్ కాదు అనుకుంటే మీరే నిరూపించండి? అంటూ సవాల్ చేశారు. ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ తో ఆగదని చెబుతూ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తుల మీద కూడా చేస్తారని, చివరకు  హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేస్తారని హెచ్చరించారు. తన ఫోన్ ను దొంగచాటుగా వినలేదని నిరూపించగలరా? అని ప్రశ్నించారు.