కేసీఆర్ కు తెలంగాణపై ప్రేమ లేదు, తెలంగాణ సంపదపైనే కన్నేశాడు!

సీఎం కేసీఆర్ కు తెలంగాణపై ప్రేమ లేదని, తెలంగాణ సంపదపైనే కేసీఆర్ కన్నేశాడని పేర్కొంటూ ప్రజలు మేల్కోవాలని, మరోసారి అధికారం ఇచ్చారంటే అంతే..మీ భూములు లాక్కుంటారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చి 25ఏళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ జరిగింది
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన 25 ఏళ్ల రాజకీయం చాలా పెద్ద ప్రయాణం అని తెలిపారు.1998 జనవరి 21న వాజ్ పేయి, అద్వానీలను కలిశానని, తనకు  బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయని, అవినీతి లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని నమ్మకం ఏర్పడిందని ఆమె గుర్తు చేస్తుకున్నారు. తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె స్పష్టం చేశారు.
 
తనకు పదవులపై ఆశ లేదని,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేదని తెలిపారు. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని పేర్కొంటూ అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని విజయశాంతి వెల్లడించారు. “ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చాను. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడాను” అని ఆమె తెలిపారు.
 
ఆ సమయంలో ఒక రాక్షసుడు (కేసీఆర్) ఎదురయ్యాడని, తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “నా వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడు. విలీనం చేసినప్పటి నుండి నేను ఏనాడూ ప్రశాంతంగా లేను. టార్చర్ అనుభవించాను” అని ఆమె చెప్పారు.
 
ఎంపీగా పోటీ చేసిన సమయంలో తనను ఓడగట్టేందుకు కుట్ర చేశారని ఆమె పేర్కొన్నారు. 2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదేరోజు రాత్రి తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆమె గుర్తు చేశారు. “నా తప్పేమిటో చెప్పలేదు. నాకు విముక్తి కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశానే తప్ప బాధపడలేదు” అని ఆమె తెలిపారు.
 
పార్లమెంట్ లో రాష్ట్ర విభజన బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారని విజయశాంతి ఆరోపించారు. తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటా అని స్పష్టం చేస్తూ ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆమె భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
 
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయశాంతికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హ్రుదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీలో చేరిన తరువాత రాష్ట్రమంతటా ఆమె విస్త్రతంగా పర్యటించారని, ఎక్కడికి వెళ్లినా వేలాది మంది తరలివచ్చారని ఆయన గుర్తు చేశారు.
 
 “నాఎన్నికల సభలో కూడా పాల్గొన్నారు. విజయశాంతి అంటే మహిళలకు ప్రత్యేకంగా అభిమానం. పార్లమెంట్ లో కేసీఆర్ లేకపోయినా తెలంగాణ బిల్లు మద్దతు పలికారు. ఎవరికీ తలవంచకుండా విజయశాంతి పనిచేశారు” అంటూ ఆయన అభినందనలు తెలిపారు. విజయశాంతి బీజేపీలోనే 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
 

తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ వాడుకుని వదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. విజయశాంతి మరింతగా రాజకీయాల్లో రాణించాలని, మరో పాతికేళ్లు రాజకీయాల్లో కొనసాగాలని అభిలాషను వ్యక్తం చేశారు.

 
సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు 25 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. సినిమా గ్లామర్ ప్రపంచం. రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువని పేర్కొంటూ అవన్నీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణి గర్జిస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
 
 ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో పార్టీని వీడినప్పటికీ తిరిగి పార్టీలోకి వచ్చిన విజయశాంతికి చివరి మజిలీ బీజేపీయే కావాలని ఆయన స్పష్టం చేశారు.

చిన్న చిన్న సమస్యలకు ఇబ్బందిపడి, భావోద్వేగాలతో పార్టీని వీడిన వారు, సైద్దాంతిక భావాలున్న వారంతా తిరిగి బీజేపీలోకి రావాలని ఈ సందర్భంగా సంజయ్ పిలుపిచ్చారు.  అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడదామని చెబుతూ లేకుండా ప్రజలు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
 
తమిళనాడు సహాయ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జి.వివేక్, మాజీ మంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీలు చాడా సురేష్ రెడ్డి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొని విజయశాంతిని ఘనంగా సన్మానించారు.