టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా సూర్యకుమార్

టీమిండియా మిస్టర్‌ 360 గా పేరుగాంచిన స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్  ఐసీసీ మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.  ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్‌ చరిత్ర సృష్టించారు.
ఈ అవార్డు తనను వరించడంతో గొప్ప అనుభూతి పొందుతున్నానని సూర్య కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ సామ్ కుర్రాన్, పాకిస్తానీ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా కూడా ఈ ఐసీసీ టైటిల్ కోసం పోటీ పడిన వారిలో ఉన్నారు. 2022 తనకు ఎంతో అద్భుతమైనదని, టీ20 మ్యాచులను ఎంతో ఆస్వాదిస్తూ ఆడినట్లు సూర్య కుమార్‌ చెప్పారు.
అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత సూర్యకుమార్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. రికార్డుల శ్రేణులను బద్దలు కొడుతున్న ఈ బ్యాట్స్‌మెన్‌ టీ 20 ఫార్మాట్‌లో మునుపెన్నడూ లేని విధంగా బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. అతను టీ20 లలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు.
31 మ్యాచ్‌లలో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2022 సంవత్సరాన్ని ముగించాడు. వీటిలో 68 సిక్సర్లతో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం. గత ఏడాది 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌ 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. సూర్య స్ట్రైయిక్‌ రేటు 187.43గా ఉంది.  ఇంతకుముందు విరాట్‌ కోహ్లీ, ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మూడు సార్లు, మహేంద్ర సింగ్‌ ధోనీ 2 సార్లు, రోహిత్‌ శర్మ ఓ సారి ఐసీసీ అవార్డులు గెలిచారు.

కాగా, శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీ్‌సలలో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ లేపాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన జాబితాలో సిరాజ్‌ మొత్తం 729 పాయింట్లతో.. హేజిల్‌వుడ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ను వెనక్కునెట్టి నెం:1 ర్యాంక్‌ను దక్కించుకొన్నాడు. మరో టీమిండియా పేసర్‌ షమి 32వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక, బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఆరో ర్యాంక్‌లో, రోహిత్‌ శర్మ 8వ ర్యాంక్‌లో నిలిచారు. కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు.