కేంద్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి శనివారం బెదిరింపులు వచ్చాయి. నాగ్పూర్లోని గడ్కరీ కార్యాలయానికి కాల్ చేసిన దుండగులు గడ్కరీని చంపుతామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదరించారు. ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, 12.30 గంటలకు ఇలా మొత్తం మూడుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.
‘‘నేను దావూద్ (మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం)ను. రూ.వంద కోట్లివ్వు. లేదంటే నిన్ను హతమారుస్తాం. నీ కార్యాలయాన్ని పేల్చేస్తాం’’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. మహారాష్ట్రలోని గడ్కరీ నియోజకవర్గ కేంద్రం నాగ్పూర్లోని ఆయన కార్యాలయ ల్యాండ్ లైన్ నంబరుకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ పేరుతో బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు.
దాంతో గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న నాగ్పూర్ పోలీసులు వెంటనే ఘటనపై దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని నాగ్పూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ మదానే చెప్పారు.
నాగ్పూర్లోని ఖమ్లా చౌక్ ఏరియాలో నితిన్ గడ్కరీ కార్యాలయం ఉన్నది. ఆ కార్యాలయానికి, నితిన్ గడ్కరీ నివాసానికి మధ్య దూరం కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే. కాగా, గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గడ్కరీ నాగపూర్ ఆఫీస్ కు చెందిన బీఎస్ఎన్ ఎల్ ల్యాండ్ లైన్ కు వచ్చిన కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు. ఒక్కరే ఆ కాల్స్ చేశారా? లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా, బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
More Stories
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలపై సిబిఐ దర్యాప్తు
హర్యానా లో మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు