సుప్రీంకోర్టును ఆశ్రయించిన గాయాలకు గురైన పోలీసు కుటుంబాలు!

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గాయాలకు గురైన పోలీసు కుటుంబాలు!
 
* జంతర్ మంతర్ వద్ద సిజెపి నిరసనల్లో 980 మందికి పైగా నేర చరిత్ర 
 
జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో జులై 20, 24, 25 తేదీల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పోలీసు సిబ్బంది కుటుంబాలు న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ వెంకట రఘువంశీ ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ అడ్వకేట్ శ్రీధర్ పోతరాజు ఈ విషయాన్ని లేవనెత్తగా, బుధవారం జరగనున్న విచారణలో ఆయన దీనిపై వాదనలు వినిపించనున్నారు.
విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆందోళనకారుల హింసకు గురై తీవ్రంగా గాయపడిన ఏసీపీ కైలాష్ సింగ్ బిష్ట్, ఏఎస్ఐ సందీప్, కానిస్టేబుల్ ధీరజ్, ఏఎస్ఐ హమేందర్ రాఠీల కుటుంబ సభ్యులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దాడి ఘటనకు సంబంధించిన వాస్తవాలను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లేందుకు తమను ఈ కేసులో బాధ్యులుగా పరిగణించాలని వారు విజ్ఞప్తి చేశారు. 

నిరసన ప్రదర్శనల సమయంలో ఢిల్లీ పోలీసులు, కేంద్రీయ బలగాలకు చెందిన సిబ్బందిపై ఆందోళనకారులు గాజు సీసాలు, రాళ్లు, పదునుపెట్టిన ఫ్లోరింగ్ టైల్స్, ఇతర ప్రమాదకరమైన వస్తువులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారని పిటిషన్‌లో స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన తమ విధులను నిర్వర్తిస్తున్న వేళ ఈ రకమైన దాడులు జరగడం వల్ల సదరు అధికారులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నారని వివరించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం పౌరులకు వచ్చిన భావవ్యక్తీకరణ, నిరసన తెలిపే స్వేచ్ఛ పరిమితులకు లోబడి ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు తోటి పౌరులపై లేదా ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్న చట్టబద్ధమైన అధికారులపై భౌతిక దాడులు చేయడానికి, గాయపరచడానికి ఇచ్చిన లైసెన్స్ కాదని వారు స్పష్టం చేశారు.

మరోవంక, జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిపిజే) నిరసనలో పాల్గొన్న,  ఆ పరిసరాల్లో ఉన్న 2,873 మందిని పరిశీలించగా, వారిలో 980 మందికి పైగా వ్యక్తులకు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.   అంటే పరిశీలించిన వారిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందికి పోలీసు రికార్డులు ఉన్నాయి. వీరిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, కిడ్నాప్, మహిళలపై నేరాలు, అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి కేసుల చరిత్ర ఉంది. 
 
ఈ దర్యాప్తు వివరాలు తెలిసిన ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, కనీసం 101 మంది హత్య కేసుల్లో, 62 మంది హత్యాయత్నం కేసుల్లో, 284 మంది దోపిడీ కేసుల్లో, 229 మంది ఆయుధాల చట్టం కింద, 135 మంది వస్తువులను లాక్కోవడం వంటి కేసుల్లో, 19 మంది కిడ్నాప్ కేసుల్లో, 67 మంది ఎన్డిపిఎస్ చట్టం (మాదకద్రవ్యాల నిరోధక చట్టం) కింద నమోదైన కేసుల్లో గతంలో ప్రమేయం కలిగి ఉన్నారు. 
 
వీరిలో 61 మంది అత్యాచార కేసుల్లో, 25 మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లేదా లైంగిక వేధింపుల కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నారని, అలాగే ఆరుగురిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. జూలై 20న సిజెపి నిర్వహించిన “చలో సంసద్” నిరసన సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో ఈ పరిశీలన ప్రక్రియ చేపట్టారు. 
 
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో 65 మందికి పైగా నిరసనకారులు,  200 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భద్రతా దళాలు పెల్లెట్ గన్‌లను ఉపయోగించాయని నిరసనకారులు ఆరోపించారు. న్యూఢిల్లీ జిల్లాలో సిజెపి జరిపిన నిరసన వేదిక వద్ద, పరిసరాల్లో భారీగా జనం గుమిగూడటం, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ పరిశీలన ప్రక్రియను చేపట్టినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 
 
ఈ పరిశీలన ద్వారా వెల్లడయ్యే వివరాలు నిరసన సమయంలో జరిగిన హింసపై సాగుతున్న సమగ్ర దర్యాప్తులో భాగంగా ఉంటాయని, అలాగే మరింత లోతుగా పరిశీలించాల్సిన వ్యక్తులను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.