అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన 45 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతూ 2023 చివరినాటికి పనులు పూర్తి చేసి, 2024 జనవరి నాటికి భక్తులు శ్రీరాముడిని దర్శించుకునే లక్ష్యంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.
2024లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే నాటికి ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, భక్తుల దర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి గర్భగుడి కింది అంతస్తు పనులు కూడా పూర్తవుతాయని వెల్లడించారు. సూర్యోదయ కిరణాలు విగ్రహంపై పడేలా గర్భగుడి రూపకల్పన చేసినట్లు చెప్పారు.
‘ఈ రోజు దేశం మొత్తం లోహ్రీని జరుపుకుంటోంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రామ మందిరాన్ని నిర్మించాలనే మా లక్ష్యంలో సగానికి పైగా సాధించాము. 2024లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో.. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. భక్తుల సందర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తాం’ అని ఆయన వివరించారు.
కాగా, ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే సగం దశకు చేరుకున్నాయని రాయ్ తెలిపారు. ఆగస్టు నాటికి గర్భగుడి కింది అంతస్తు పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు. మూడు అంతస్తుల్లో, ఐదు మండపాలుగా చేపడుతున్న రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1800 కోట్లు ఖర్చవుతాయని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది.
More Stories
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొవిషీల్డ్ పై దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్