కర్ణాటకలో 112 అడుగుల ఆదియోగి విగ్రహం

కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఏర్పాటు చేసిన 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై  ఆవిష్కరించారు. చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌, మంత్రులు డాక్టర్ కె.సుధాకర్, నగేష్, సిసి పాటిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
 
యోగాకు మూలంగా ఆదియోగిని భావిస్తారు. మరోవైపు ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం ఎన్నో ఏళ్ల నుంచి ఆదియోగి అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని తెలిపారు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆదియోగి విగ్రహాన్ని కొన్ని సెకన్ల పాటు చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయని బసవరాజ్ బొమ్మై చెప్పారు.
 
 ‘మనం శివుడిని అర్థం చేసుకుంటే, సృష్టిని అర్థం చేసున్నట్లే. మన సంస్కృతిని నిలబెట్టే కార్యకలాపాలకు మా ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో సంఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి ఆదియోగి కావాలి. ఈ విగ్రహావిష్కరణతో చిక్‌బళ్లాపూర్‌ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.’ అని బొమ్మై పేర్కొన్నారు.
 
ఆదియోగి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లేజర్ షో వీక్షకులను కట్టిపడేసింది. కర్ణాటక జానపద నృత్యాలు , కేరళ కళాకారులు ప్రదర్శించిన థెయ్యమ్ డ్యాన్స్ సైతం విశేషంగా అలరించాయి. ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించటంతో పర్యాటకుల సందర్శనకు అనుమతివ్వనున్నారు.