హోమియో వైద్యులు డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి మృతి

తెలుగు రాష్ట్రాల్లో హౌమియోపతి వైద్య వ్యాప్తికి అపార కృషి చేసిన డాక్టర్‌ పావులూరి కృష్ణచౌదరి (96) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న రాత్రి హైదరాబాద్‌ అమీర్‌ పేటలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
 
నాలుగు నెలల కిందట కృష్ణచౌదరికి గుండె కవాట మార్పిడి చికిత్స జరిగింది. గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. నిన్న రాత్రి మృతి చెందారు. కుమారుడు అమెరికా నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. వ్యక్తిగా, డాక్టర్‌ గా అర్ధవంతమైన జీవితాన్ని గడిపారంటూ స్నేహితులు, సన్నిహితులు ఆయనతో బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కృష్ణ చౌదరి భార్య సుందర రాజేశ్వరి 2010లో కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు 18 ఏళ్ల వయస్సులోనే మృతి చెందారు. రెండో కుమారుడు డాక్టర్‌ నరేంద్రనాథ్‌ అమెరికాలో డాక్టర్‌ గా సేవలను అందిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె అపర్ణ కూడా డాక్టర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. హౌమియో వైద్య నిపుణురాలిగా పేరుగాంచారు.

ఎంబిబిఎస్‌ చదివిన కృష్ణ చౌదరి హౌమియో వైద్య వ్యాప్తికి అపార కృషి చేశారు. లండన్‌ వెళ్లి హౌమియో వైద్య విద్యను అభ్యసించి పట్టభద్రుడయ్యారు. స్వదేశానికి తిరిగివచ్చి జీవితమంతా పూర్తిగా హౌమియో వైద్యం అభివృద్ధికి కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హౌమియో వైద్యంతో అపర ధన్వంతరిగా కృష్ణ చౌదరి పేరుపొందారు.

 
ఆంగ్ల వైద్యం అల్లోపతి సహజ వైద్యం హౌమియోపతిని కలిపి వ్యాధులకు చికిత్సదను అందించేవారు. రోగులకు అయ్యే ఖర్చులను తగ్గించడానికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడానికి 90 ఏళ్ల వయసులోనూ శ్రమించారు.