ఎంపీలో 9 అక్రమ ఆయుధ తయారీ కేంద్రాలు గుర్తించిన ఏపీ పోలీస్ 

మధ్యప్రదేశ్ లోని అక్రమంగా ఆయుధాలు తయారు చేసే 9 కేంద్రాల‌ను అనంతపురం పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్రమ ఆయుధాలు, తూటాలు తయారు చేసి అక్రమంగా రవాణా చేయడమే కాకుండా గంజాయి వంటి మాదక ద్రవ్యములు కూడా విక్రయిస్తున్నట్లు ప్రత్యేక బృందం దర్యాప్తులో తెలిసిందని, మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

అనంతపురం జిల్లా డీ హీరేహళ ప్రాంతంలో పట్టుబడ్డ అక్రమ ఆయుధాల కేసు విచారణలో ఇవి బట్టబయలయ్యాయి. గత డిసెంబర్ 25న  నిర్వహించిన దాడుల్లో అక్రమ రవాణాకు సిద్దంగా ఉంచిన వివిధ రకాల తుపాకులు, తూటాలు పట్టుబడ్డాయి. 

ఆ సందర్భంగానే పోలీసులు నిందితులైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన జంషీద్, ముబారక్, అమీర్ పాషా, గోవాకు చెందిన రియాజ్ షేక్, మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ పాల్ సింగ్ జునే చోటు, చున్నిలాల్ @ నన్ను సుతార్ ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ ఆయుధాలకు సంబంధించిన కేసులను నమోదు చేశారు.

కోర్టు ఆదేశాలతో వారిని అదుపులోకి తీసుకుని, వారిచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో పలు ప్రదేశాలకు వెళ్ళి సాక్ష్యాలు సేకరించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బర్వాణి జిల్లా, వర్గ తాహసీల్, ఉమర్టీ గ్రామంలో అక్రమ ఆయుధాలు తయారు చేసే కేంద్రంపైన దాడి చేసి 4 పిస్తోల్స్, 2 తూటాలు, తుపాకులు తయారు చేయడానికి ఉపయోగించే యంత్ర పరికరములను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

అత్యంత చాకచక్యంగా అంతరాష్ట్ర ఆయుధాల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకొన్నందుకు అనంతపురం పోలీసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీసు రాజేంద్రనాధ్ రెడ్డి అభినందించి, రూ.25,000 ల‌ నగదు రివార్డ్ ప్రకటించారు.