వైసీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి బహిష్కరణ?

కొంతకాలంగా పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తూ, పార్టీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న  మాజీ  మంత్రి, వెంకటగిరి ఎమ్యెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ నుంచి బహిష్కరింపనున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.  తాజాగా,  ‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం’ అంటూ చేసిన వాఖ్యలతో పార్టీ నాయకత్వం వేటు వేయనున్నట్లు తెలుస్తున్నది.
 
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా పేరొందిన ఆయన పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమాచార, పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖల మంత్రిగా పనిచేశారు. తొలుత ఎన్టీ రామారావు మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి ఎమ్యెల్యేగా ఎన్నికైనా మంత్రి పదవి ఇవ్వక పోవడం,  పైగా జిల్లాలోని పార్టీ నాయకులు ఎవ్వరు పట్టించుకొనక పోవడంతో అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు.

నెల్లూరు జిల్లా రాపూరులో డిసెంబర్ 28న వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ సచివాలయం కన్వీనర్ల తొలి సమావేశంలో పాల్గొంటూ  పెన్షన్‌ ఇస్తే ఓట్లు వేసేస్తార? పథకాలు ఇస్తే ఓట్లు వేసేస్తారా?  పేదలు నాలుగు ముద్దలు నోట్లో వేసుకుంటే తాగేందుకు బిందెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

‘కేవలం పెన్షన్‌ ఇస్తేనే ఓట్లు వేస్తారా!? అలా అయితే గత టీడీపీ ప్రభుత్వంలో సైతం పెన్షన్లు ఇచ్చారు. అయితే వారి కంటే కొంత ఎక్కువ ఇస్తున్నాం. కేవలం ప్లాట్లు ఇచ్చాం తప్ప ఒక్కటంటే ఒక్క ఇల్లయినా నిర్మించామా’ అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో ముందజలో ఉందని.. కానీ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వెనుకంజ వేస్తోందని విమర్శించారు.

అంచనాలు సిద్ధం చేసి హైకమాండ్‌కు పంపినా స్పందించలేదని చెప్పారు. అమృత్‌-2 పథకం కింద కేంద్రప్రభుత్వ నిధులతో వెంకటగిరిలో రూ.93 కోట్లతో మరో సమ్మర్‌ స్టోరేజి ఏర్పాటుకు అనుమతులు అందాయని, టిడ్కో ఇళ్లు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా తాగునీటి వసతి లేక వాటిని ప్రారంభించలేదని ధ్వజమెత్తారు.

కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడో అక్కడ సర్దుకుంటూ పోతున్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల ముందుకు ఎలా వెళ్లి ఓట్లు అడగాలని నిలదీశారు. కేంద్రం జలజీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు ఇస్తుంటే ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ కలగా పిలుచుకునే సోమశిల, స్వర్ణముఖి కెనాల్‌ను నిజం చేయలేకపోతున్నట్లు చెప్పారు. కనీసం ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు పిలిచినా రాలేదంటూ ముఖ్యమంత్రి జగన్‌పై పరోక్షంగా విమర్శలు సంధించారు.

కండలేరు డ్యాం నిర్మాణం కోసం.. పుట్టిన ఊళ్లను వదులుకుని వచ్చినవారికి ఎలాంటి వసతీ కల్పించలేకపోయామన్నారు. కనీసం వాళ్ల దాహార్తి కూడా తీర్చలేకపోయినట్లు చెప్పారు. పరిహారం కోసం ఇప్పటికీ బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగేళ్లు గడిచాయి.. మరో ఏడాది పోరాడండని పార్టీ పెద్దలు చెబుతున్నారని.. పోరాడి పైకెక్కి కూర్చోవాలని తమకూ ఉంటుందని.. కానీ దానికి మార్గమెలాగని ప్రశ్నించారు.

ఆనం తాజాగా మంగళవారం నాడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలుంటాయని వార్తలొస్తున్నాయి. అవే వస్తే మేమంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయం’ అని ఎద్దేవా చేశారు.  వెంకటగిరి నియోజవర్గ ఇంఛార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించాలని జగన్ భావిస్తున్నారు. త్వరలో వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘‘వెంకటగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2014 వరకు నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. సంవత్సరం తరువాత వచ్చే ఎన్నికలకు, ఇప్పుడే నా సీటుకు ఎసరు పెడుతున్నారు. వెంకటగిరికి నేనే రేపు ఎమ్మెల్యే అని ఓ పెద్దమనిషి చెప్పుకుంటున్నాడు. వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా? కుర్చీ లాగేద్దామా అని.. కొంతమంది ఆశపడుతున్నారు’’ అని ఆనం పార్టీలో తనపై జరుగుతున్న కుట్ర గురించి ముందే చెప్పారు.

\