పింఛను డబ్బుల్లో దొంగనోట్లు…గ్రామ వాలంటీర్ నిర్వాకం

గ్రామ వలంటీరు పింఛను డబ్బుల్లో దొంగనోట్లు కలిపి పంపిణీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో అధికారులు స్పందించారు. వలంటీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం ప్రకారం నరసాయిపాలెం ఎస్‌సి కాలనీ గ్రామ వలంటీరుగా ముటుకూరి ఆమోష్‌ పని చేస్తున్నాడు.
 
ఒకటో తేదీ కావడంతో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులలో రూ.19,500 పక్కకు తీసి తన దగ్గర ఉన్న రూ.19.500 దొంగనోట్లను (రూ.500 నోట్లను) అందులో కలిపాడు. 24 మంది లబ్ధిదారులకు రూ.2,750 చొప్పున పింఛను పంపిణీ చేశాడు. ఇందులో కొంతమందికి నకిలీ నోట్లు వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఇచ్చాడు.
 
పింఛను డబ్బులు తీసుకున్న బంగారమ్మ అనే మహిళ తన బంధువులకు ఫోన్‌ పే చేయించేందుకు వెళ్లింది. ఇందుకోసం దుకాణందారునికి డబ్బులు ఇచ్చింది. ఇందులో దొంగనోట్లు ఉన్నట్లు ఆయన గుర్తించి ఆమెకు తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా లబ్ధిదారులు కూడా తాము తీసుకున్న పింఛను డబ్బులను దుకాణందారు దగ్గరకు తీసుకెళ్లి చూపించగా, వాటిలోనూ దొంగనోట్లు బయటపడ్డాయి.
 
ఈ విషయాన్ని నరసాయిపాలెం సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పేరయ్య, ఎంపిడిఒ ఎం.రంగసుబ్బరాయుడు దృష్టికి లబ్ధిదారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కలిసి నరసాయిపాలేనికి ఎంపిడిఒ వచ్చి నిలదీయడంతో తానే దొంగనోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వలంటీర్‌ ఒప్పుకున్నాడు.
 
ఎంపిడిఒ ఫిర్యాదు మేరకు వలంటీరును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దొంగనోట్లు వలంటీర్‌కు ఎలా వచ్చాయి? ఇటువంటి చర్యకు పాల్పడడం ఇదే తొలిసారా? ఇందుకు ముందుకూడా ఇలా చేశాడా? ఈ దొంగనోట్ల వెనుక ఎవరు ఉన్నారు? తదితర విషయాలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం.