ఆసుపత్రిలోనే హరిరామజోగయ్య ఆమరణ దీక్ష

కాపు రేజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య సోమవారం నుండి పాలకొల్లులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయనను పోలీసులు ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఆయన ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు .

హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్‌ ఏలూరు ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు పోలీసులు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే వైద్యం అందించాలని, అందుకు సహకరించేలా ఒప్పించాలని కోరారు.  అయితే, పోలీసుల తీరుపై సూర్యప్రకాశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమం ఆస్పత్రికి తీసుకెళ్తామని.. తన తండ్రిని ప్రభుత్వాస్పత్రిలో ఉంచడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రి లోపలికి వెళ్తున్న టీడీపీ, జనసేన  నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

హరిరామజోగయ్యకు జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ ఫోన్‌ చేశారు. హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్‌ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

కాగా, ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించడంతో ఎట్టకేలకు ఆయన ఆసుపత్రిలో ఎట్టకేలకు దీక్ష విరమించారు. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో మాట్లాడానని చెబుతూ ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వమని.. కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పానని పవన్ కళ్యాణ్ తెలిపారు.