చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ దేశంలో వేల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్కు చెందిన ఎయిర్ఫినిటీ అనే పరిశోధనా సంస్థ డ్రాగన్ కంట్రీలో రోజుకు సుమారు 9 వేల మంది కోవిడ్తో మరణిస్తున్నారని తన నివేదికలో పేర్కొన్నది.
కరోనా ఆంక్షలు ఎత్తివేయకముందు నుంచి కొన్ని ప్రావిన్స్లలో కరోనా తీవ్రతను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్క డిసెంబర్ నేలలో కోటీ 86 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. వారిలో సుమారు లక్ష మంది మరణించి ఉంటారని పేర్కొన్నది. జనవరి మధ్య నాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించింది.
నెలాఖరుకు వైరస్ 5 లక్షల 84 వేల మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నది. కాగా, డిసెంబర్ 30న దేశంలో ఒక్కరు మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించడం విశేషం. అయితే వాస్తవిక గణాంకాలను వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనా ప్రభుత్వాన్ని కోరింది.
దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని సూచించింది. వైరస్ బారినపడి దవాఖానల్లో చేరిన వారి సంఖ్య, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనా మరణాలు, టీకాలపై డాటాను పంచుకోవాలని చైనా ఆరోగ్య అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇలా ఉండగా, కరోనా వేళ ప్రజల ప్రాణాలను కాపాడడానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది చైనా విధానమని అధ్యక్షులు జీ జిన్పింగ్ చెప్పారు. కొత్త సంవత్సరం 2023 లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా శనివారం ఆయన టివిలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి పట్ల దృక్పథంలో ‘కొత్త దశ’ లోకి ప్రవేశిస్తునుందున మరింత ఐక్యత, కృషి అవసరమని పిలుపిచ్చారు.
కోవిడ్కు వ్యతిరేకంగా సాగిన పోరులో అనూష్యంగా ఎదురైన కష్టాలను, సవాళ్ళను చైనా విజయవంతంగా అధిగమించిందని పేర్కొన్నారు. అవసరమైన పరిస్థితులు తలెత్తినపుడు ఆ సమయం ఆసన్నమైనపుడు కరోనా విధానాలు గరిష్ట స్థాయిలో తీసుకున్నట్లు తెలిపారు.
More Stories
తైవాన్ లో గంటల వ్యవధిలో 80 సార్లు కంపించిన భూమి
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ భారీ విజయం
సముద్రంలో కూలిన రెండు జపాన్ నేవీ హెలికాప్టర్లు