పాక్ – ఆఫ్ఘన్ సరిహద్దులో 10 వేల మంది ఉగ్రవాదులు!

పాకిస్తాన్,  ఆఫ్ఘనిస్తాన్  దేశాలు ఉగ్రవాదులకు పుట్టినిల్లు అని మొత్తం ప్రపంచం  నమ్ముతుంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ స్వయంగా నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఉగ్రవాదులకు పాక్‌ భూతల స్వర్గం అని కూడా ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.

,అయితే, తాజాగా పాకిస్తాన్ హోమ్ మంత్రి రాణా సనావుల్లా చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. తమ దేశ సరిహద్దుల్లో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఆయనే ఆరోపణలు చేశారు.  పాకిస్థాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో పది వేల మంది ఉగ్రవాదులు కాసుకూర్చున్నారని రాణా సనావుల్లా తాజాగా వెల్లడించారు.

ఇటీవల డాన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  ‘పాకిస్థాన్‌-ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దులోని ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో సుమారు 7 వేల నుంచి 10 వేల మంది వరకు తెహ్రీక్‌ ఎ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రవాదులు కాసుకూర్చున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు మరో 25 వేల మంది అక్కడే ఉన్నారు” అని చెప్పారు.

నవంబరు నుంచి టీటీపీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని కూడా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక దళ విభాగం వైఫల్యమే ఇందుకు కారణం అని రాణా సనావుల్లా ఆరోపించారు. కాగా, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం గమనార్హం.