పీఓకె పౌరులపై పాక్ “క్రూరమైన బలప్రయోగం”పై భారత్ ఆగ్రహం

పీఓకె పౌరులపై పాక్ “క్రూరమైన బలప్రయోగం”పై భారత్ ఆగ్రహం
పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పిఓజెకె)లో పౌరులపై “క్రూరమైన బలప్రయోగం” చేస్తోందని, ఈ అణచివేతలో 40 మందికి పైగా మరణించారని భారత్ ఆరోపించింది. అంతేకాకుండా, తాము ఒకప్పుడు శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులే దేశానికి వ్యతిరేకంగా మారారని ఇస్లామాబాద్ స్వయంగా అంగీకరించడాన్ని కూడా భారత్ అవకాశంగా తీసుకుంది. 
 
మీడియా సమావేశంలో ప్రశ్నలకు సమాధానమిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పిఓజెకెలో శాంతియుత నిరసనలపై పాకిస్థాన్ ప్రభుత్వం హింసతో స్పందించిందని, దీని ఫలితంగా “40 మందికి పైగా అమాయక ప్రజలు” మరణించారని, ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.  “పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో శాంతియుత పౌరులపై పాకిస్థాన్ ప్రభుత్వం క్రూరమైన బలప్రయోగాన్ని కొనసాగిస్తోంది. ఈ అణచివేత ఫలితంగా 40 మందికి పైగా అమాయక ప్రజలు విషాదకరంగా మరణించారు, ఇంకా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు,” అని జైస్వాల్ మండిపడ్డారు. 
 
“భారతదేశంలో రక్తపాతం సృష్టించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆయుధాలు ఇచ్చి, నిధులు సమకూర్చి, శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్‌లే ఇప్పుడు తమ తుపాకులను సొంత దేశంపైనే ఎక్కుపెట్టారని ప్రధానమంత్రి రాజకీయ వ్యవహారాల ప్రత్యేక సహాయకుడు బహిరంగంగా అంగీకరించారు,” అని ఆయన విమర్శించారు. 
 
పాకిస్తాన్ రక్షణ మంత్రి నిరసనకారులను “శత్రువులు”గా ముద్రవేయడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్  ప్రజల పట్ల ఇస్లామాబాద్‌కు ఉన్న “తీవ్రమైన ధిక్కారాన్ని” ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆ ప్రాంత నివాసులు అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశారని, పాకిస్తాన్‌ను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారని జైస్వాల్ తెలిపారు.
 
 “పాకిస్తాన్ చర్యలను అంతర్జాతీయ సమాజం నిశితంగా పరిశీలించి, దాని దురాగతాలకు జవాబుదారీగా నిలబెట్టాలని మేము కోరుతున్నాము,” అని ఆయన పేర్కొన్నారు. ఆ భూభాగాన్ని “పాకిస్తానీ కాశ్మీర్”గా పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ నివేదిక గురించి అడిగినప్పుడు, ఆ ప్రాంత హోదాపై భారతదేశం దీర్ఘకాలిక వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. 
 
పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం “భారతదేశంలో అంతర్భాగం,  విడదీయరానివి” అని జైస్వాల్ స్పష్టం చేశారు. “మా భాగస్వాములు, సంబంధిత వర్గాలన్నీ ఈ ప్రాంతానికి సరైన నామకరణం చేయాలని మేము కోరుతున్నాము,” అని ఆయన తెలిపారు.