గాంధీ కుటుంబమే అత్యంత అవినీతి కుటుంబం

భారత దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబమే అత్యంత అవినీతి కుటుంబం అని, ‘కట్టర్ పాపి పరివార్’అని బిజెపి నిందించింది. తనపై మనీ లాండరింగ్ దర్యాప్తును కొట్టివేయించాలని రాబర్ట్ వాద్రా చేసుకున్న వినతిని రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించిన తర్వాత బిజెపి జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా ఈ వ్యాఖ్యలు చేశారు.

వాద్రాపై వచ్చిన మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మౌనం విడిచి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. రాబర్ట్ వాద్రా రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని వివాహమాడారు. కాంగ్రెస్ పార్టీ హర్యానా, రాజస్థాన్, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ మనీలాండరింగ్ జరిగిందని గౌరవ్ భాటియా నిందించారు.

రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో పెట్టినవేనని కాంగ్రెస్ తరచూ వాదించడాన్ని ఆయన కొట్టిపారేశారు. బికనేర్‌లో ఓ కంపెనీ(స్కైలైట్ హాస్పిటాలిటీ) భూమి కొనుగోలు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) దర్యాప్తును కొట్టివేయాల్సిందిగా వాద్రా పెట్టుకున్న వినతిని రాజస్థాన్ హైకోర్టు గత వారం తిరస్కరించింది. ఆ కంపెనీకి వాద్రా తల్లికి ప్రచ్ఛన సంబంధం ఉందనే ఆరోపణలున్నాయి.

“భారత్‌లో ‘ఈ కట్టర్ పాపి పరివార్’ అవినీతి, భూకుంభకోణంకు పాల్పడి వాద్రాకు అప్పగించింది” అని గౌరవ్ భాటియా ఆరోపించారు. వాద్రాపై రాజకీయ వేట కొనసాగుతోందన్న కాంగ్రెస్ ఆరోపణను ఆయన తోసిపుచ్చారు.

“భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబమే అత్యంత అవినీతి కుటుంబం. ఆ కుటుంబంలోని ముగ్గురు అత్యంత అవినీతిపరులు. వారు అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయటికి వచ్చినవారే. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో బెయిలుపై బయటికి వచ్చినవారే” అని ఆయన గుర్తు చేశారు.