
చలికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోవడంతో అక్కడి ప్రజలు చలి తీవ్రతను తట్టుకోలేక వణికిపోతున్నారు. ఉత్తర భారతదేశంలో శీతల గాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. రాత్రిపూట మైనస్ డిగ్రీలకు చేరుతుంటడం ఆందోళన కలిగిస్తోంది.
దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలైన ధర్మశాల, నైనిటాల్లో కన్నా ఢిల్లీలోనే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మశాలలో 6.2 డిగ్రీలు, నైనిటాల్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా, హస్తినలో 6 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 5.6 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాజస్థాన్, హర్యానా, ఢిల్లి, పంజాబ్, జమ్ము-కాశ్మీర్ వంటిచోట్ల చలిగాలుల ప్రభావం మరిన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఢిల్లిలోని పాలమ్, నపుర్జంగ్లో ఉదయం 5.30 గంటలకు 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధానిలో రాత్రివేళ కనిష్ట-గరిష్ట ఉష్ణోగ్రతలు 5-8 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.
రాబోయే కొద్దిరోజులు దట్టమైన పొగమంచు ఉంటుందని అంచనా వేసింది. పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వేకువ జామున దట్టమైన మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. నార్నాల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్కు పడిపోయింది. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
చండీగఢ్లో 6.9 డిగ్రీల సెల్సియస్ వద్ద చలిగాలులు కొనసాగుతుండగా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు హిస్సార్, రోహ్తక్, భివానీ, సిర్సా వంటి చోట్ల ఉష్ణోగ్రతలు వరుసగా 3.9, 6.6, 4.4, 4 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో పొగమంచు కారణంగా అనేక రైలు సర్వీసులు ప్రభావితం అయ్యాయి. దృశ్యమానత 0-50 మీటర్ల మధ్య ఉంటోంది.
కాగా, దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో న్యూఢిల్లీకి రావాల్సిన 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, మరో రెండు విమానాలను దారి మళ్లించామని ఇందిరాగాంధీ విమానాశ్రయం ప్రకటించింది. స్పైస్ జెట్, ఇండిగో విమానాలను జైపూర్ మళ్లించామని, సుమారు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం