బెంగుళూరు డ్రగ్స్‌ కేసులో కేటీఆర్!

దేశాన్ని మొత్తం రాజకీయ కలకలం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం  అటూ ఇటూ తిరిగి చివరికి తెలంగాణకు వచ్చి ఆగడం, ఇందులో బడా పారిశ్రామిక వేత్తలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉండగా, తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసు  అదే విధంగా కేటీఆర్ చుట్టూ తిరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
లిక్కర్ స్కాం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తూ అందుకు సంబంధించిన ఇద్దరు నిందితుల ఛార్జ్‌షీట్లలో కవిత పేరు ప్రస్తావించటంతో త్వరలోనే ఈడీ ఆమెకు నోటుసులు పంపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే విధంగా బెంగళూరు డ్రగ్స్ కేసులో బిఆర్ఎస్ ఎమ్యెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు రెండు రోజుల పాటు విచారణ చేశారు.
బిఆర్ఎస్ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను ముందుగానే హెచ్చరిస్తూ వస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కేసు విషయంలో సహితం చేసిన హెచ్చరిక కలకలం రేపుతోంది. సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కున్నారన్న  సంజయ్.. త్వరలోనే ఆయన కుమారుడు కూడా మరో స్కాంలో దొరికిపోతున్నారని జోస్యం చెప్పడం గమనార్హం.
 కేటీఆర్‌కు బెంగుళూరు డ్రగ్స్‌ కేసుకు సంబంధముందని ముందు నుంచి ఆరోపిస్తున్న బండి సంజయ్ నార్కోటిక్ టెస్ట్‌ చేయించుకోవాలని గతంలో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఆ సవాల్ మళ్లీ తెరమీదికి రావటంతో దీనిపై కేటీఆర్ ఘాటుగానే స్పందించారు.
తన వెంట్రుకలు, రక్తంతో పాటు అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని, ఏమీ తేలకపోతే సంజయ్ చెప్పు దెబ్బలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దానికి అంతే తీవ్రంగా స్పందించిన సంజయ్ టీఆర్ విదేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చి, ఇప్పుడు వెంట్రుకలిస్తానంటున్నాడని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో మొత్తం కేటీఆర్ దోస్తులే ఉన్నారని స్పష్టం చేస్తూ హైదరాబాద్, బెంగుళూరు డ్రగ్స్ కేసుల్లో ముమ్మర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో కేటీఆర్‌‌కు సంబంధముందని ముందు నుంచి చెబుతున్న సంజయ్ త్వరలోనే దొరికిపోతున్నారని అంటూ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లకు వెళ్ళిమళ్ళి చెప్పడంతో దుమారం చెలరేగుతోంది. రోహిత్ రెడ్డి విషయంలోనూ ఇలాగే సంజయ్ చెప్పిన రెండు రోజుల్లోనే అధికారులు నోటీసులు పంపడం గమనార్హం.