మూసీ, గోదావరి కాలుష్య ప్రక్షాళనకు కేంద్రం సహాయం

తెలుగు రాష్ట్రాల్లోని మూసీ, గోదావరి సహా గుర్తించిన కాలుష్య భరిత నదీతీరాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, తక్కువ ఖర్చుతో కూడుకున్న శానిటేషన్, నదీ తీరాల్లో స్నానపు ఘాట్ల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని  కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ హామీ ఇచ్చారు.
 
తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), మన్నె శ్రీనివాస రెడ్డి (బీఆర్ఎస్) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ  నదుల్లోకి మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కలపకుండా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు.
 
నదుల ప్రక్షాళన ఒక నిరంతర ప్రక్రియ అని చెబుతూ నీటి వనరులు రాష్ట్రాల పరిధిలోని అంశమని గుర్తు చేశారు. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ (ఎన్ఆర్సీపీ) కింద హైదరాబాద్, భద్రాచలం, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో మొత్తం 621.46 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ. 345.72 కోట్ల వ్యయంతో కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులను మంజూరు చేశామని తెలిపారు. 
 
గోదావరి తీరం వెంట రాజమండ్రి వద్ద రూ. 21.78 కోట్లతో 30 ఎంఎల్డీ సామర్థ్యం కల్గిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) ఏర్పాటైందని ప్రహ్లాద్ సింగ్ జవాబులో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ నది కాలుష్యాన్ని నివారించేందుకు 2007లోనే రూ. 335.65 కోట్లతో 593 ఎంఎల్డీ సామర్థ్యం కల్గిన ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. 
 
 రాజమండ్రిలో ఇప్పటికే ఉన్న ఎస్టీపీ సామర్థ్యాన్ని 30 ఎంఎల్డీ నుంచి 50.6కు పెంచడానికి రూ. 88.46 కోట్లతో ప్రాజెక్ట్ మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.