చైనాకు ఔషధాలు పంపేందుకు భారత్ సిద్ధం!

ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఫార్మాసూటికల్ ఉత్పత్తిదారుగా ఉంది. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు చూసి ఆ దేశానికి జ్వరం నివారణ మందులు పంపేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఇండియన్ డ్రగ్ ఎక్స్‌పోర్ట్ కమిటీ అధిపతి తెలిపారు. ఈ నెల ఆరంభంలో చైనా కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో అక్కడ ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి.
అక్కడ ఇప్పుడు జ్వరానికి కావలసిన ఔషధాలకు, వైరల్ టెస్ట్ కిట్స్‌కు బాగా డిమాండ్ ఉంది. చైనా నుంచి మన దేశ ఔషధ తయారీదారులకు ‘ఇబుప్రోఫెన్’, ‘పారాసెటమాల్’ కొటేషన్లు కావాలన్న వినతులు వస్తున్నాయని ఫార్మాసూటికల్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) చైర్మన్ సాహిల్ ముంజల్ తెలిపారని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తెలిపింది.
చైనాలో ఇబుప్రోఫెన్, పారాసెటమాల్ ప్రస్తుతం తక్కువ సరఫరా ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది. అయితే న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ మాత్రం ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.  భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఔషధ తయారీలో భారత్ అతిపెద్ద ఉత్పత్తిదారు. అందుచేత చైనాకు సాయపడేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ తన రొటీన్ బ్రీఫింగ్‌లో “ మేము చైనా కరోనా  పరిస్థితిని గమనిస్తున్నాం. ప్రపంచంలోని పలుదేశాలకు మేము ఫార్మాసీ సాయం అందించాం” అని పేర్కొన్నారు.
ఫార్మ్‌ఎక్సిల్ తాజా వార్షిక రిపోర్టు ప్రకారం చైనాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఔషధాలు కేవలం 1.4 శాతమే. ఇప్పటికీ భారత్ నుంచి ఔషధాలు ఎక్కువగా  ఎగుమతి అయ్యేది అమెరికాకే. కరోనా మళ్లీ ఉదృతం అవుతోందన్న ఆందోళనలు వెళ్లువెత్తుతుండడంతో భారత ఔషధ కంపెనీలు మళ్లీ గత కొన్ని రోజులుగా ఉత్పత్తిని పెంచాయి.
 
ఇలా ఉండగా, జీరో కొవిడ్‌ పాలసీని సడలించిన తర్వాత చైనాలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో అక్కడ పరిస్థితి మరింత దిగజారవచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నదని లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ సంస్థ తాజాగా తన నివేదికలో హెచ్చరించింది.
జనవరిలో రోజుకు గరిష్ఠంగా 37 లక్షల కేసులు నమోదుకావొచ్చని, మార్చినాటికి ఇది 42 లక్షల పెరుగొచ్చని అంచనావేసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవంగా నమోదవుతున్న కేసులకు భారీ తేడా ఉన్నదని ఆరోపించింది. చైనాలో బుధవారం 2,966 కొత్త కేసులు నమోదయ్యాయని, 10 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది.
కాగా, కరోనా ఉద్ధృతి కారణంగా చైనా దవాఖానల్లో బెడ్‌లు దొరకని పరిస్థితితో పాటు శ్మశానాల్లో కరోనా మృతుల అంత్యక్రియలు సైతం గగనంగా మారే అవకాశాలున్నాయి. కరోనా పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్‌ టెస్టింగ్‌ బూత్‌లను ప్రభుత్వం నిలిపివేసిందని, దీంతో ప్రజలు ఇంటి వద్దనే కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారని ఎయిర్‌ఫినిటీ తెలిపింది.