విభజన హామీలను అన్నీ నెరవేరుస్తున్నాం 

విభజన హామీలను అన్నీ నెరవేరుస్తున్నామని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము ఏమి చెయ్యలేదనడం శోచనీయమని ఆమె విచారం వ్యక్తం చేశారు.  బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. 
 
పోలవరంకు సంబంధించి కేంద్రం హామీ ఇచ్చినట్లుగా, అన్నివిధాల రాష్ట్రానికి సహాయం చేస్తున్నామని ఆమె తెలిపారు.. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకీ అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు.  రాష్ట్రంలో అన్నిశాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని ఆమె ఆరోపించారు.  వైసీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఎందుకు డిజిటల్ పేమేంట్స్‌ను అమలుచేయడం లేదని పురందేశ్వరి  ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు కార్పొరేషన్‌లోని శ్మశానాల్లో రూ.5 వేల చొప్పున అంతిమక్రియలకు వసూలు చేయడం దారుణమని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం దివాళా దిశగా పయనిస్తోందనడానికి ఇదే నిదర్శనం అని ఆమె స్పష్టం చేశారు.