గత ఏడాది కన్నా 17 శాతం పెరిగిన బొగ్గు ఉత్పత్తి

దేశంలో బొగ్గు కొరత లేదని, గత ఏడాది కన్నా 17 శాతం మేరకు ఉత్పత్తి పెరిగిందని  కేంద్ర  బొగ్గు, గనులు,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ఆయన ఇచ్చిన సమాధానం ప్రకారం 2022-23 లో (2022 నవంబర్ నాటికి)దేశంలో 524.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 448.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.
అదే విధంగా దేశంలో 2022-2023 లో (2022 నవంబర్ వరకు) దేశంలో  558.24 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా/పంపిణీ జరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన  521.08 మిలియన్ టన్నుల సరఫరా/పంపిణీ తో పోల్చితే దాదాపు 7.33 % వృద్ధిని సాధించింది.

2022-23లో విద్యుత్ రంగంలో పెరిగిన బొగ్గు వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఐఎల్ 380.58 మిలియన్ టన్నుల (2022 నవంబర్ వరకు) బొగ్గు సరఫరా చేసింది గత ఏడాది ఇదే సమయానికి జరిగిన 339.8 మిలియన్ టన్నుల సరఫరాతో పోల్చి చూసే ఈ ఏడాది ఇంతవరకు సరఫరా 12% పెరిగింది.

బొగ్గు సరఫరాకు సంబంధించి విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఒక ఉప సంఘం ఏర్పాటయింది. విద్యుత్ మంత్రిత్వ శాఖలు, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటైన  అంతర్-మంత్రిత్వ శాఖ ఉప సంఘం తరచూ సమావేశం అవుతూ పరిస్థితిని సమీక్షిస్తోంది.

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు  బొగ్గు సరఫరా మెరుగు పరచడానికి, విద్యుత్ రంగంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యల పరిష్కారం, అత్యవసర బొగ్గు నిల్వలు లాంటి అంశాలపై సంఘం నిర్ణయాలు తీసుకుంటుంది. దీనితో పాటు బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మరి కమిటీ ఏర్పడింది.

ఈ కమిటీలో  రైల్వే బోర్డు చైర్మన్,   బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ,సిఈఏ ఛైర్‌పర్సన్  ప్రత్యేక ఆహ్వానితులుగా అవసరమైన సమయంలో సహకారం అందిస్తారు. క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు పంపిణీ జరుగుతున్న తీరును  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

భారతదేశంలో ఇంధనానికి ప్రధాన వనరుగా బొగ్గు ఉంది. బొగ్గు డిమాండ్ పెరుగుతూ  2030-2035 నాటికి  గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని  దేశంలో బొగ్గు లభ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం పలు  చర్యలు అమలు చేస్తోంది.

కోల్ ఇండియా గనుల నుంచి మెరుగైన బొగ్గు ఉత్పత్తి కోసం ఇప్పటికే ఉన్న గనుల సామర్థ్యంతో పాటు కొత్త గనులు/ప్రాజెక్టుల నిర్వహణ, వాణిజ్య బొగ్గు గనుల  ఉత్పత్తి ఎక్కువ చేయడం, గనులు, ఖనిజాల  (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం, 2021  చట్టం నిబంధనలు కఠినంగా అమలు చేసి  క్యాప్టివ్ గనుల యజమానులు (అణు ఖనిజాలు కాకుండా) వారి వార్షిక ఖనిజ (బొగ్గుతో సహా) ఉత్పత్తిలో 50% వరకు అవసరాలను తీర్చిన తర్వాత బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి వీలు కల్పించడం వంటి చర్యలు చేపట్టింది.