తెలంగాణాలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం కృషి

తెలంగాణలో వైద్య  మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.1,028 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్ వద్ద ఎయిమ్స్  ను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో గతంలో ఉన్న నిర్మాణాలను 720 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుగుణంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
30 పడకల ఆయుష్ హాస్పిటల్, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులకు అకాడమిక్ బ్లాక్, హాస్టల్స్, సిబ్బందికి క్వార్టర్స్, 650 మంది కూర్చునేలా ఆడిటోరియం, సమావేశ మందిరం నిర్మాణం, ఓపీడీ బ్లాక్ నిర్మాణాలను చేపట్టామని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులకు తరగతులతో పాటు ప్రజలకు ఓపీడీ సేవలు కూడా ప్రారంభమయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు.
సనత్ నగర్ లోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో  కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణం, అధునాతన వైద్య సదుపాయాల కల్పన కోసం రూ. 1,032 కోట్లను కేటాయించామని చెప్పారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఆదిలాబాద్ లోని రిమ్స్, వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలకు ఒక్కోదానికి రూ. 120 కోట్లు చొప్పున మొత్తం రూ.240 కోట్లు ఖర్చు చేసి నూతన బ్లాకుల నిర్మాణాలను చేపట్టామని కిషన్ రెడ్డి వివరించారు.
ఇందులో భాగంగా 150 నుంచి 250 వరకు అదనపు పడకలను, కొత్త ఆపరేషన్ థియేటర్లను, 8 నుంచి 10 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. వీటికి తోడుగా దాదాపు 15 అదనపు పీజీ సీట్లను కేటాయించామని వివరించారు. రూ. 902 కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణవ్యాప్తంగా 4,549 హెల్త్, వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు రూ.30 కోట్ల నిధులతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సదరన్ రీజియన్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రూ.3,744 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 31.2 లక్షల మరుగుదొడ్లను నిర్మించామని వివరించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న నరేంద్రమోదీ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా లేఖలు పంపవలసినదిగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు.