అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

శబరిమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొండలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వస్తోన్న లక్షల మంది భక్తులతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. సోమవారం ఒక్క రోజే స్వామి దర్శనం కోసం రూ.1,07,260 మంది భక్తులు తమ పేర్లను బుక్ చేసుకున్నారు. శనివారం లక్ష, ఆదివారం 1.10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు తరలిరావడంతో దర్శనానికి రికార్డుస్థాయిలో బుకింగ్‌లు వచ్చాయి.
 
కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో శబరిమలకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దిగువన పంబ నుంచి సన్నిధానం వరకూ ఆరు కిలోమీటర్ల మేర క్యూలైన్‌ భక్తులతో నిండిపోయింది.

భారీ సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ అదనపు ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం శబరిమలలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. అసలు ఒక సీజన్ లో ఒక్క రోజులో అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలకు రావడం ఇదే మొదటిసారి అని ఆలయం వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలావుండగా కేరళ హైకోర్టు డిసెంబర్ 11న (ఆదివారం) ప్రత్యేక సిట్టింగ్‌ను నిర్వహించింది. బిజీ రోజుల్లో భక్తుల కోసం మొక్కు సమయాన్ని పొడగించాలని సూచించింది. అంతేకాక జనాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులు, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

ట్రావాంకోర్ దేవస్థానం బోర్డు(టిడిబి), శబరిమల తంత్రిని సంప్రదించి ఆలయాన్ని మరో 30 నిమిషాలు లేక గంట పాటు ఎక్కువ సేపు తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు తెలిపింది. భక్తులు పెరిగిపోవడం వల్ల నియంత్రణ చర్యలు చేపట్టాల్సి వస్తోంది. జనాన్ని నియంత్రించడంలో కొంత మంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయని కోర్టు పేర్కొంది. 

ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు అనిల్ కె. నరేంద్రన్, పిజి. అజిత్ కుమార్ తో కూడిన ధర్మాసనం పథనంథిట్ట జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ చీఫ్‌ను రోజుకు 75000కు మించి భక్తులు వచ్చినప్పుడు జన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పథనంథిట్టలోని నిలక్కల్‌లో పార్కింగ్ గ్రౌండ్‌లు కూడా నిండుకున్నప్పుడు నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

రోజువారీ భక్తుల సగటు సంఖ్య 75 వేలకు పైగానే ఉంటోంది. భారీ సంఖ్యలో రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నదానం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాగా 41 రోజుల మండల పూజా పండుగ డిసెంబర్ 27న ముగుస్తుంది. ఆ తర్వాత గుడి తలుపులు మకరవిలక్కు తీర్థయాత్రికుల కోసం డిసెంబర్ 30 వరకు తెరిచి ఉంటుంది. ఆ మకర విలక్కు వేడుక 2023 జనవరి 14న ముగియనుంది. అంతకుముందు నవంబర్ 24న అయ్యప్ప తీర్థయాత్రకు మొదటి ఆరు రోజుల్లో 2.5 లక్షల మంది యాత్రికులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు.