నాగ్ పూర్‭లో మెట్రో సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ

నాగ్ పూర్‭లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడమ్ పార్క్ నుంచి ఖాప్రి వరకు మోడీ మెట్రోలో ప్రయాణించారు. మెట్రో రైలులో ప్రయాణిస్తూ విద్యార్థినీ, విద్యార్థులతో ముచ్చటించారు. 
 
స్టార్టప్ కంపెనీల రంగానికి చెందినవారితో, ఇతర వివిధ రంగాల్లో పని చేసేవారితో కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ట్వీట్ చేసింది. రూ.6,700 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న మెట్రో రెండవ దశ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు.  
 
నాగ్‌పూర్ మెట్రో గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లై ఓవర్ గల మెట్రో ఇదే. మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవులో రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించ లేదు. అందుకే నాగ్‌పూర్ మెట్రో ఈ ఘనతను సాధించింది. దీని పొడవు 3.14 కిలోమీటర్లు.
ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ తీసుకున్నారు. అలాగే, నాగ్‌పూర్‌ మెట్రో పేరు మీద గతంలో మరో రికార్డు కూడా ఉంది.  డబుల్ డక్కర్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు కలిగి ఉండడంతో ఇది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‭లో చోటు దక్కించుకుంది. వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయోడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర పొడవు.
 
మెట్రోతో పాటు రూ.590 కోట్లతో నాగ్‌పూర్, రూ.350 కోట్లతో అజ్నీ రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి పనులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒన్ హెల్త్‌ భవన నిర్మాణానికి కు మోదీ శంకుస్థాపన చేశారు.  అనంతరం నాగ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడిచే ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  ప్రధాని ప్రారంభించిన ఆరో వందే భారత్ రైలు ఇది. ఈ కార్యక్రమంలో మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి ప్రముఖలు పాల్గొన్నారు.
వందే భారత్ ట్రైన్ గరిష్ట స్పీడ్ గంటకు 160 కిలోమీటర్లు. శతాబ్ది ట్రైన్‌ మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. అయితే ఇంకా మెరుగైన సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. ఈ ట్రైన్ హై స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఫాస్టర్ యాక్సిలేరేషన్, డీసెలెరేషన్ కారణంగా ఈ ట్రైన్ త్వరితగతిన వేగాన్ని అందుకుంటుంది.
అలాగే జర్నీ టైమ్ ఏకంగా 25 నుంచి 45 శాతం వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ కొత్త తరహా ట్రైన్స్‌లో ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అన్ని కోచ్‌లలోనూ ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై, కంఫర్టబుల్ సీటింగ్ వంటి ప్రత్యేకతలు ఈ ట్రైన్స్ లో ఉన్నాయి.
బిలాస్‌పూర్ నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ విషయానికి వస్తే ఇది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలో పని చేస్తుంది. ఈ ట్రైన్‌కు రాయ్‌పూర్, దూర్గ్, గోండియా వంటి ప్రాంతాల్లో స్టాప్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ వారంలో ఆరు రోజులు తిరుగుతూనే ఉంటుంది. అలాగే నాగ్ పూర్ లో మరికొన్ని ప్రాజెక్టులను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.