రెండోసారి గుజరాత్‌ సీఎం పీఠంపై భూపేంద్ర పటేల్‌

 
గుజరాత్‌ తదుపరి ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ఈ మేరకు పటేల్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దాంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 
 
రెండోసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. కాస్సేపటి క్రితం గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాల్సిందిగా గుజరాత్‌ గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి చేయనున్నది.
 
బీజేపీఎల్‌పీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా హాజరయ్యారు. ఈ సమావేశంలో భూపేంద్ర పటేల్ పేరును కానుదేశాయి ప్రతిపాదించారు. అయితే ఆయనకు పోటీగా సీఎం రేసులోకి ఎవరూ రాకపోవడంతో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు తెలియజేశారు.
 
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గం మొత్తం శుక్రవారం అధికారికంగా రాజీనామా చేసింది. డిసెంబర్ 12న గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికలకు ముందే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పటేల్‌ను బీజేపీ ప్రకటించింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తర్వాత సీఎం భూపేంద్ర పటేలేనని పీఎం నరేంద్ర మోదీ ప్రకటించారు. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 స్థానాలు గెలిచి బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.