స్వస్థత పేరుతో మైనర్ బాలికను పాస్టర్ ట్రాప్ 

ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్‌ బాలికను స్వస్థత పేరుతో ఓ చర్చి పాస్టర్‌ ట్రాప్‌ చేశాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకుని ఆ  బాలికను తన వెంట తీసుకెళ్లిన సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో కలకలం రేపింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన 45 ఏళ్ల వయసున్న నాగేశ్వర్‌ నూజివీడులో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య ఆనారోగ్యంతో చనిపోయింది. నాగేశ్వర్‌కు సుమారు 20 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలున్నారు. నూజివీడులో చర్చికి వచ్చిన బాలికకు స్వస్థత చేకూరుస్తానని మాయమాటలు చెప్పిన పాస్టర్ నాగేశ్వర్ లోబర్చుకున్నాడు.
ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను గత కొన్ని రోజులుగా గన్నవరం మండలం ఉస్తాబాద్‌ గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు. బాలిక జాడ తెలుసుకున్న నాగేశ్వర్‌ ఈ నెల 2వ తేదీన ఉస్తాబాద్‌ వచ్చాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో బాలికను తన వెంట హైదరాబాదుకు తీసుకెళ్లాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నాగేశ్వర్‌తో పాటు బాలిక కూడా హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వీరిని గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.