రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, 160 సీఆర్పీసీ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీబీఐ అలోక్ కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు.
కేసు విచారణలో భాగంగా కాకుండా కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 6 వ తేదీన తనకు వీలైన సమయంలో హైదరాబాదా లేదా వీలైతే ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చి కేసు గురించి వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
‘కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమల్లో అవకతవకల ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 రెడ్ విత్ సెక్షన్ 120బీ, ఐపీసీ సెక్షన్ 447 ఏ కింద ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఈ కేసులో వెలుగులోకి వచ్చిన కొన్ని వాస్తవాలతో మీకు సంబంధం ఉన్నట్లు గుర్తించాం” అని ఆ నోటీసులో పేర్కొన్నారు.
“దర్యాప్తు అవసరాల దృష్ట్యా ఆయా వాస్తవాల గురించి మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు మిమ్మల్ని విచారించడానికి మీకు అనుకూలంగా ఉండే నివాసమేదో (హైదరాబాద్ లేదా వీలైనంతవరకూ ఢిల్లీ) చెప్పండి’’ అని కవితకు జారీ చేసిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.
వారి అభ్యర్థన మేరకు.. హైదరాబాద్లోని నివాసంలో తనను ప్రశ్నించాల్సిందిగా సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని కవిత మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో కవిత పాత్ర ఉందని, ఆ పాలసీని రూపొందించే సమయంలో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో ఆమె పాల్గొన్నారని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం తెర మీదకు వచ్చిన రోజు నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినిపిస్తోంది. అయితే, మొదటిసారిగా ఈ కేసులో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులోనే కవిత పేరు అధికారికంగా బయటకు వచ్చింది. ఈడీ అధికారులు చేర్చిన పేర్లలో కల్వకుంట్ల కవిత అనే పేరు ఉంది. 32 పేజీల రిపోర్టులో మూడు చోట్ల కవిత పేరును అధికారులు ప్రస్తావించారు.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన మద్యం కేసులో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు తరలించినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రైవేట్ విమానాల్లో డబ్బు తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ‘సౌత్ గ్రూప్’ను శరత్ రెడ్డి, కె కవిత, మాగుంట నియంత్రించిన ట్లు తాజా రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.
ఈ కుంభకోణంలో కవిత పాత్ర ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. వీరంతా కలిసి ముడుపులను ఎవరికి ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే వివరాలను కోర్టుకు సమర్పించిన రిపోర్టులో ఈడీ అధికారులు స్పష్టంగా వివరించారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో కార్యకలాపాల నిమిత్తం ఉపయోగించిన 10 సెల్ఫోన్లను కవిత ధ్వంసం చేసినట్లు తాజా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపింది. ఈ కేసులో మొత్తం 36 మంది రూ. 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది.
అమిత్ అరోరా విచారణలో కవిత పేరు బయటపడడం, ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ప్రస్తావించడం.. ఆ తర్వాత 48 గంటలు గడిచేలోపే ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
More Stories
త్వరలో భారత్లోకి ఎయిర్ట్యాక్సీలు
తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్