తప్పు చేయకపోతే ఉలికి పాటెందుకు కవితా!

తప్పు చేయని పక్షంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రిమాండ్ రిపోర్టులో తన పేరును ఈడీ చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత ఎందుకు ఉలిక్కిపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  ప్రశ్నించారు. ఆమె కావాలనే బీజేపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
 ఇప్పటివరకు ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియా లీకులకే పరిమితం కాగా మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని, దీంతో రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీజేపీ చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆరోపించారు.
అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలంలో సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, శరత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లు ఉన్నాయని  రఘునందన్ రావు పేర్కొన్నారు. కానీ ప్రధాని మోదీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేయసారు.
ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ, తప్పుడు కేసులు పెట్టించాలనే ఉద్దేశం బీజేపీకి లేదని ఆయన స్పష్టం చేశారు.  సౌత్ గ్రూప్‌లో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటూ కవిత కూడా భాగస్వామి అన్నది నిజమా? కాదా?  అదే గ్రూపు పేరుతో అవినీతి పాల్పడ్డారా? లేదా?… అనే విషయాలపై మాట్లాడకుండా బీజేపీని విమర్శించడం ఏంటని రఘునందన్ రావు ప్రశ్నించారు.
తప్పు చేసిన వారు చట్టబద్ధంగా విచారణను ఎదుర్కోవాలని, నిజంగా తప్పు చేసినట్లు రుజువైతే ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని తేల్చి చెప్పారు. తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఆయన  ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తుందా, లేదా అనే విషయం.. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు.
 ఎంత పెద్ద నేరస్థుడు అయినా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని తప్పు చేసినా తప్పించుకోలేరని రఘునందన్ రావు స్పష్టం చేశారు. కొంచెం ఆలస్యమైనా నేరస్థులను దర్యాప్తు సంస్థలు, అధికారులు పట్టుకుంటారని ఆయన తెలిపారు. సౌత్ గ్రూప్ కంపెనీ ఆప్ పార్టీ నేతలకు విజయ్ నాయర్‌ అనే మధ్యవర్తితో రూ. 100 కోట్లు పంపించారో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
రూ. 100 కోట్లు ఎందుకు ఇచ్చారు? పంజాబ్ ఎన్నికలకు రూ. 100 కోట్లు వెళ్లాయా లేదా అని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. టీఆర్ఎస్ 104 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే నోటీసులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. నేరం చేసిన వాళ్లకు మాత్రమే దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చాయని తేల్చి చెప్పారు.