తెలంగాణాలో సగం మందికి పైగా మద్యం బానిసలే 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే `బంగారు తెలంగాణ’ సాధిస్తామని చెప్పిన కేసీఆర్ ఎనిమిన్నరేళ్ళ  ఏలుబడిలో `బంగారం’ మాట ఏమో గాని విచ్చలవిడిగా జనం మద్యం సేవించడం మాత్రం పెరిగి పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఈ కాలంలో మద్యంపై నాలుగు రేట్ల వరకు పెరగగా, దేశంలోని అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 
 
తెలంగాణలో 15 నుంచి 49 వయసు వారిలో సగానికిపైగా మందు కొడుతున్నారని అధ్యయనంలో తేలింది. కొత్తగా మందుకు అలవాటు పడుతున్న వారి సంఖ్య కూడా జాతీయ సగటు కన్నా వేగంగా పెరుగడం ఆందోళనకు గురిచేస్తోంది.పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాజిక అంతరాలు పెరిగి, నేరాలు పెచ్చురిల్లే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
అరుణాచల్ ప్రదేశ్ జనాభా 15 లక్షలు కాగా అందులో సగం మందికి పైగా మందు తాగుతున్నారు. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎక్కడబడితే అక్కడ మందు దొరుకుతూ ఉండటంతో ఆడ మగ తేడా లేకుండా అందరూ తెగ  తాగేస్తున్నారు. తెలంగాణలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మందు కొడుతున్నారని తేలింది.
 గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం మంది మదుపానప్రియులు ఉన్నారు. ఇందులో 54 శాతం మంది వారంలో ఒకసారి తాగుతుంటే, 28 శాతం మంది నాలుగు రోజులకు ఒకసారి మందు కొడుతున్నారు. 19 శాతం మంది ప్రతి రోజూ మందు తాగుతున్నారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
మందు అలవాటు ఉన్న పురుషుల కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు తీవ్ర హింసకు గురవుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది. వారిలో 16 శాతం మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ  రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 35 వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. పది లక్షల జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్  7వ స్థానంలో నిలిచింది. తొలుత కల్లు, తరవాత బీరుతో ప్రారంభిస్తున్న మందుబాబులు, తరవాత గంజాయి, నాటు సారాలకు అలవాటు పడుతున్నారు.
దీంతో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరో వైపు తెలంగాణలో మద్యం ఆదాయం చూస్తే కళ్లు తిరగాల్సిందే. హన్మకొండలో ఓ వైన్ షాప్ ఏకంగా రూ.39 కోట్ల మందు అమ్మింది. ఇక తెలంగాణలో ప్రతి మద్యం షాపు ఏటా కనీసం పది కోట్ల పైనే బిజినెస్ చేస్తోంది.
ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ లో మద్యం ద్వారా సుమారు రూ. 35,000 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేస్తే, రూ 45,000 కోట్ల వరకు రాగలదని ఇప్పుడు తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ మొత్తం సుమారు రూ 13,000 కోట్లుగా ఉండెడిది.  ఇక తయారీ దారులకు, అమ్మకం చేసిన వారికి లభించే ఆదాయం లెక్కిస్తే తెలంగాణ ప్రజలు ఏటా మందు కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.