ఇక్కడ దోపిడీ సరిపోదన్నట్టుగా… ఢిల్లీకి పోయి దందాలు!

ఇక్కడ చేసిన దోపిడీ సరిపోదన్నట్టుగా… ఢిల్లీకి పోయి దందాలు చేయాల్సిన అవసరం ఏముందని టిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాజీ మంత్రి, బీజేపీ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నవారికి కచ్చితంతా శిక్ష పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ స్పష్టం చేశారు. 

ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూమిని మాయం చేశారని పేర్కొంటూ వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించుకుని… ఆ అవినీతి సొమ్ముతో తమలాంటి వాళ్లను ఓడించేందుకు ఖర్చు పెడుతున్న సంగతి నిజం కాదా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజానీకాన్ని రెండే రెండు మాటలు అడుగుతున్నానని అంటూ 2014 వరకు అటుకులు బుక్కి ఉద్యమాన్ని నడిపామా? ఉపవాసం ఉండి ఉద్యమాన్ని నడిపామా? చెప్పాలని నిలదీశారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకుని, ఓటు మాత్రం టీఆర్ఎస్ కు వేయాలని ఆనాడు ప్రజలను కెసిఆర్ కోరారని గుర్తు చేశారు. 

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను కొనుక్కునే స్థాయికి కెసిఆర్ ఎలా వచ్చారని ఈటెల ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన నిలదీశారు. పైగా, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నది ఎవరో చెప్పాలని అడిగారు.

టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ. 800 కోట్ల వైట్ మనీ ఉందని కెసిఆర్ చెప్పారని గుర్తు చేస్తూ అతి తక్కువ కాలంలోనే ఇంత భారీగా సొమ్ము ఎలా వచ్చిందని ఈటల ప్రశ్నించారు. ఉపవాసం ఉన్న పార్టీకి ఇంత తక్కువ కాలంలోనే వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాజేందర్ అడిగారు. 

 ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరని పేర్కొంటూ ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అయన సూచించారు. ఇందిరాగాంధీ వంటి నియంతలనే మట్టికరిపించిన దేశం భారతదేశమని చెబుతూ ప్రజల ముందు ఎంతటి వారైనా తక్కువేనని చెప్పారు. 

భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కు అప్పుడే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టారని పేర్కొంటూ టిఆర్ఎస్ ను కాదని ఇతర పార్టీలకు చెందిన ఏడుగురిని ఎంపీలుగా గెలిపించారని గుర్తు చేశారు. ఎంతో చైతన్యం కలిగిన తెలంగాణలో నీ ఆగడాలు, దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు పని చేయవని సిఎం కెసిఆర్ ను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.