శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు

కేరళలోని ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి గత పది రోజుల్లో ఆలయానికి భక్తులు పోటెత్తగా భారీగా ఆదాయం సమకూరింది. రూ.52.55కోట్ల ఆదాయం సమకూరిందని దేవస్వమ్‌ బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్‌ తెలిపారు. గతేడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయానికి రూ.9.92కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.

ఆలయానికి వచ్చిన ఈ ఆదాయంలో మూడొంతులు ఉత్సవాల నిర్వహణకే వినియోగించనున్నట్లు దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. మండకాలం ప్రారంభం నుంచి అయ్యప్ప దీక్షాపరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌, స్పాట్‌బుకింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

 సన్నిధానానికి వెళ్లేందుకు నాలుగు ద్వారాలను తెరిచామని, వీటి ద్వారా భక్తులు ఆలయానికి వెళ్లొచ్చని చెప్పారు. చలక్కాయం-పంబా రహదారిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, కొండ ఎక్కే ప్రధాన మార్గంలో వచ్చేవారం వరకు పూర్తవుతాయని బోర్డు పేర్కొంది. సన్నిధానం, పంపా, నిలక్కల్ వద్ద అంతరాయం లేకుండా రోజుకు మూడుసార్లు అన్నదానాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన భక్తులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 210 మందికి అత్యవసర సేవలు అందించామని, 37 మందికి గుండెపోటు రాగా.. 30 మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులు నిత్యం కనీసం అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

పంపా, నీలిమల, అపాచెమేడు, సన్నిధానం ఆసుపత్రుల్లో కార్డియాలజిస్ట్ సేవలు అందుబాటులో చెప్పారు. కొండ ఎక్కే సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. భిక్ష చేసిన వెంటనే కొండ ఎక్కవద్దని, నెమ్మదిగా ముందుకు వెళ్లాలని సూచించారు.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అలసట ఏవైనా శారీరక ఇబ్బందులుంటే ఆపి వేయాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే 04735 203232 ఫోన్‌ చేస్తే సిబ్బంది దగ్గరకు చేరుకొని అవసరమైన సహాయం అందిస్తారని జిల్లా వైద్యాధికారి అనిత కుమారి తెలిపారు.