మతమార్పిళ్లుకు వ్యతిరేకంగా త్వరలో చట్టం

బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బలవంతపు మత మార్పిళ్ల అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అతి త్వరలో దీనిపై చట్టం తీసుకొస్తామని వెల్లడించింది.
 
ఇప్పటికే 9 రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం తరపున కూడా అతి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.చట్టం తీసుకు వచ్చిన రాష్ట్రాలు: ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, కర్ణాటక.
 
కర్ణాటకలో అమలు చేస్తున్న మత మార్పిడి నిరోధక చట్టం ప్రకారం  తప్పుడు వివరణ, బలవంతం, మోసం, అనుచిత ప్రలోభాలు, నిర్బంధం లేదా పెళ్లి వంటి కారణాలతో ఒక మతం వారు మరొక మతంలోకి మారడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది.
 
ఈ చట్టం ప్రకారం నేరానికి పాల్పడినవారికి కనీసం మూడేళ్ళ నుంచి గరిష్ఠంగా ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు, అంతేకాకుండా రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. మైనర్‌, మహిళ, షెడ్యూల్డు కులాలు లేదా షెడ్యూల్డు తెగలకు చెందినవారిని చట్ట విరుద్ధంగా మతం మార్చిన వారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు.
 
ఈ చట్టానికి వ్యతిరేకంగా సామూహిక మతమార్పిడులకు పాల్పడినవారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. మతం మారాలనుకునేవారు కనీసం 60 రోజులు ముందుగా డిప్యూటీ కమిషనర్‌కు తెలియజేయాలని ఈ చట్టం చెప్తోంది. మతం మారిన తర్వాత 30 రోజుల్లోగా ఆ విషయాన్ని తెలియ జేయాలని పేర్కొంది.