న్యాయవ్యవస్థలోకి అధికంగా మహిళలు, కింది వర్గాల ప్రవేశం  

 
న్యాయవ్యవస్థలోకి మహిళలు, కింది వర్గాల వారు అధికంగా ప్రవేశించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు.హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ మన న్యాయవ్యవస్థలో ఇప్పటికీ మహిళలకు సముచిత స్థానమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 భారత న్యాయవ్యవస్థ ఇప్పటికీ భూస్వామ్య, సనాతన ఆలోచనా ధోరణితోనే పనిచేస్తున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు.  న్యాయవ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యం గురించి మాట్లాడేముందు భవిష్యత్తు తరంలో లింగ సమానత్వం సాధించేలా మనం ఇప్పటినుంచే పునాది నిర్మించాలని ఆయన సూచించారు.
`ముఖ్యంగా సీనియర్‌ లాయర్లు ఉండే వృద్ధ యువకుల క్లబ్బుల వంటి చాంబర్లలోకి మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయాలి. న్యాయవ్యవస్థను ప్రజాస్వామ్యీకరణ చేయకుండా, ప్రతిభ ఆధారంగా పనిచేసే వ్యవస్థలా మార్చకుండా అందులోకి మహిళలను, కింది సామాజిక వర్గాల వారిని తీసుకు రావడం అసాధ్యం’ అని చంద్రచూడ్ స్పష్టం చేశారు.
 ‘మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన న్యాయవ్యవస్థ ఉగ్గు గిన్నెలాంటిది. ఈ వ్యవస్థలో ఇప్పటికే ఉన్నవాళ్ల సంబంధీకులే మళ్లీ అందులోకి వస్తున్నారు. తమ పిల్లలకు ఉగ్గు గిన్నెలో తినిపించినట్టు ముందు తరం వాళ్లు.. వాళ్ల పిల్లలను తీసుకొస్తున్నారు. న్యాయ వృత్తి నిర్మాణం మనదేశంలో ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థలాగా, సనాతన వ్యవస్థలాగా ఉన్నది. ఇందులో మహిళలకు అవకాశమే ఇవ్వటంలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటం కొత్త ప్రయోగమని.. హైకోర్టులు, జిల్లాస్థాయి కోర్టుల్లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెడతామని సీజేఐ తెలిపారు. అమెరికా సుప్రీంకోర్టులో ఏటా 180 కేసులు విచారిస్తే, బ్రిటన్‌ సుప్రీంకోర్టులో 85 కేసులు విచారిస్తారని.. మన సుప్రీంకోర్టులో సోమ, శుక్రవారాల్లో ఒక్కరోజే ఒక్కో న్యాయమూర్తి 75 నుంచి 80 కేసులు విచారిస్తారని సీజేఐ తెలిపారు.
 మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఒక్కో న్యాయమూర్తి కనీసం 30 నుంచి 40 కేసులు విచారిస్తున్నారని చెప్పారు. పెండింగ్‌ కేసులు న్యాయవ్యవస్థకు పెనుభారంగా మారాయని పేర్కొంటూ న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయం అందించటంతో పాటు కొన్నిసార్లు అన్యాయానికి కూడా కారణమవుతున్నదని తెలిపారు.
‘వ్యవస్థలో గొంతెత్తలేని వారి గొంతు నువ్వు వినగలిగితే.. మీరప్పటి వరకు వ్యవస్థలో చూడని ముఖాలు ముందుకొస్తాయి. అక్కడే చట్టం, న్యాయం మధ్య మీరు పాటించే సమతుల్యత ఏపాటిదో తేలిపోతుంది.’ అని న్యాయమూర్తులను ఉద్దేశించి జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.
మరోవైపు, అణచివేతకు చట్టం సాధనం కాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థతో పాటు శాసనకర్తలపైనా ఉన్నదని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. నేడు మనం ఉపయోగిస్తున్న చట్టాలనే  బ్రిటీష్‌ వలసవాద పాలనలో ఎంతటి తీవ్ర అణిచివేతకు ఉపయోగించారో ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
ప్రజల్లో అంచనాలు ఉండటం మంచిదే అయినా వ్యవస్థలుగా కోర్టులకు ఉన్న పరిధి, అధికారాలను అర్థం చేసుకోవాల్సి ఉన్నదని సూచించారు. మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఖాళీలను భర్తీ  చేయడం న్యాయవ్యవస్థలో కీలకమైనప్పటికీ, చివరకు కేవలం న్యాయమూర్తులలో  సానుభూతితో బాధితులకు సమాధానం చెప్పగల సామర్ధ్యమే ప్రధానమని స్పష్టం చేశారు.