ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ -రెండింటిలోనూ బీజేపీ రికార్డు స్థాయిలో అత్యధిక సీట్లు గెలుపొంది, తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భరోసా వ్యక్తం చేశారు. హిమాచల్ లో 44, అంతకన్నా ఎక్కువ సీట్లు, గుజరాత్ లో రికార్డు స్థాయిలో సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.
తన స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో సుడిగాలి ప్రచారం సాగిస్తున్న ఆయన ప్రతిరోజూ దాదాపు 15 నుంచి 16 ర్యాలీల్లో ప్రచారం సాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో జైరామ్ ఠాకూర్ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు ప్రదర్శించిందని, జైరామ్ ఠాకూర్ సారథ్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తోందని, మరో మాటకు తావులేదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చాలా కాలం క్రితమే హిమాచల్ ప్రదేశ్లో దుకాణం మూసేసిందని, పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనని చెప్పారు. అయితే, కాంగ్రెస్ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈసారి హిమాచల్ మహిళలకు తాము ప్రత్యేక మేనిఫెస్టో తెచ్చామని గుర్తు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, గర్భిణీ స్త్రీలకు రూ.25,000, 6 నుంచి 12 తరగతి వరకూ ఆడపిల్లలకు సైకిల్, కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పారు. పేద మహిళలకు ఎల్పీజీ సిలెండర్లు, మహిళా రుణాలు, ఆయుష్మాన్ భారత్ అండ్ హిమకేర్ కింద మహిళలకు గతంలో అందుబాటులో లేని మరికొన్ని వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని వివరించారు.
సైకిల్, స్కూటీలు ఇస్తామనడం ఉచిత హామీల లెక్కలోకి రావా అని ప్రశ్నించినప్పుడు, పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలను ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన సమాధానమిచ్చారు. బీజేపీ తిరిగి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వస్తుందనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు.
రోడ్లు, రైళ్లు, ఆరోగ్యం, విద్య, నీళ్లు ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని, వీటికి తోడు తాము చేపట్టిన సాంఘిక సంక్షేమ పథకాలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయని చెప్పారు. గతంలో సాధించిన దాని కంటే ఎక్కువ సీట్లు ఈసారి ఎన్నికల్లో సాధిస్తామని, 44కు పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, గుజరాత్లో గత 30 ఏళ్లలో సాధించిన రికార్డును ఈసారి అధిగమిస్తామని అనురాగ్ ఠాకూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ విజయం చారిత్రాక విజయం అవుతుందని పేర్కొంటూ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు, డబుల్ ఇంజన్ ప్రభుత్వం సాధించిన విజయాలు అందరి అభినందనలు అందుకుంటున్నాయని చెప్పారు.
అనురాగ్ ఠాకూర్ తండ్రి ప్రేమ్ కుమార్ థుమాల్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా కొనసాగుతుండటాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరిలో ఎవరూ స్ట్రిక్ట్ అని ప్రశ్నించగా, ఇద్దరూ అంకితభావం కలవారని ఠాకూర్ సమాధానమిచ్చారు. ఇద్దరూ దేశం పట్ల, చేసే పనిపట్ల అంకితభావం కలిగిన వారని, వారి దృఢసంకల్పం, అంకితభావం కారణంలో జీవితంలో అనేక విజయాలు సాధించారని తెలిపారు.
More Stories
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభం
రాజ్యాంగబద్ధ పాలనకై పోరాడిన పార్టీపైనా దుష్ప్రచారం!?
పత్తాలేని బిఆర్ఎస్…కాంగ్రెస్కు ఓటమి ఖాయం