డీమ్డ్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ అమలు పట్ల హర్షం

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయం పట్ల  రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ హర్షం ప్రకటించారు. అందుకు ఆయన యూజీసీకి అభినందనలు తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చెప్పారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉందని ఆయన తెలిపారు.  గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల దేశంలోని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాలేదని ఆయన విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి లోపాలను క్రమంగా సవరిస్తున్నారని ఆయన కొనియాడారు. అందులో భాగంగానే డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని యుజిసి నిర్ణయం తీసుకుందని చెప్పారు. అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, యూజీసీ లకు డా. లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు.
 
భారతదేశంలో సుమారు 423 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, వాటితో పాటు మరో 130 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కో యూనివర్సిటీ ప్రతి ఏడాది సగటును 3,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తే, మొత్తం 16 లక్షల మందికి అడ్మీషన్ పొందుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 8 లక్షల మంది విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోతున్నారని ఈ సందర్భంగా డా. లక్ష్మణ్ చెప్పారు.
 
తెలంగాణ ప్రభుత్వం కూడా యూజీసీ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డా. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 10కి పైగా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీల్లో సుమారు 30,000 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారని, వాటిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 15,000 సీట్లు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. 
 
రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్ల సదుపాయాన్ని విస్మరించిందని డా. లక్ష్మణ్ విమర్శించారు. యుజిసి  ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుండే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ అమలు చేసేలా అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.